GST Rate Reduction : కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించినప్పటికీ, అదే సమయంలో ఇది “ఎనిమిదేళ్ల ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాని డిజైన్, అధిక రేట్లపై తాము నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నామని, అయితే ప్రభుత్వం తమ మాటలను పట్టించుకోలేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం, కుటుంబాల అప్పులు పెరగడం, పొదుపు పడిపోవడం, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్ల వంటి ఏదో ఒక కారణం వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఇది రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్న చర్య అని ఆయన పరోక్షంగా సూచించారు.మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని “తర్వాతి తరం సంస్కరణలు”గా అభివర్ణించారు. సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరచడం, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చడం వంటి లక్ష్యాలతోనే ఈ సంస్కరణలు చేపట్టామని ఆయన తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు. ఈ మార్పులు ప్రజల ఆదాయాన్ని పెంచి, వ్యయాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు.
Andhra Pradesh Local Body Elections: ఏపీలో మరో ఎన్నికల నగారా ..!
అధిక పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ రేట్ల తగ్గింపు వల్ల నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో సహా అనేక వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే, ఒకవైపు పన్ను తగ్గింపును స్వాగతిస్తూనే, దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఎన్నికల ముందు లబ్ధి పొందే ప్రయత్నమా లేక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే నిర్ణయమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

