Patna: తరుచూ పాము కాటుకు గురై వ్యక్తులు మృతి అనే వార్తలు చూస్తుంటాం. పాములతో విన్యాసాలు చేస్తున్న వార్తలను కూడా చూస్తుంటాం. ఇపుడు జరిగిన సంఘటన మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఆ మధ్య పాము కాటు వేసిందని వ్యక్తి కొరికి చంపడం, మద్యం మత్తులో పామును తిన్న వ్యక్తి లాంటి వార్తలను చూసాం. ఇదే కోవకి చెందింది ఈ వార్త. బీహార్ రాష్ట్రంలోని వెస్ట్ చంపారన్ పట్టణంలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఓ తల్లి తన కుమారుడైన గోవిందా కుమార్ అనే ఏడాది బాబుని ఇంట్లోని వరండాలో వదిలేసి తన పనిలో నిమగ్నమైంది. గోవిందా కుమార్ ఆడుకుంటున్న సమయంలో తనకు చేరువలోకి ఒక పాము వచ్చింది. దానిని చూసిన బాలుడు అది ఒక ఆడుకునే వస్తువులా భావించి దానిని పట్టుకున్నాడు. దానిని పట్టుకోగానే బాలుడి చేతిని పాము చుట్టేసింది. వెంటనే బాలుడు పాముని నోట్లో పెట్టి కరిచాడు. దాంతో ఆ పాము చనిపోవడం జరిగింది.
అప్పుడే అటుగా వెళ్తున్న బాలుడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి.. ఈ ఘటనను చూసి భయోక్తురాలై బాలుడి నుండి పామును వేరు చేసి దూరంగా పారివేసింది. అప్పటికే నీరసిస్తూ ఉన్న బాలుడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. బాలుడి పరిస్థితి విషమించడంతో బెట్టియా జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించారు.
హుటాహుటిన వైద్యులు బాలుడికి చికిత్స అందించి ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని భరోసా ఇచ్చారు. పాము పిల్లాడిని కాటు వేయలేదని, నోట్లో పెట్టుకుని కొరకడం వల్ల విషం కొంత నోట్లోకి వెళ్లి ఉంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ దువాకాంత్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడని వైద్యుడు చెప్పారు. కొన్ని గంటల పాటు అబ్సర్వేషన్ లో ఉంటే సరిపోతుంది అని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
విషం చిమ్మే పామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన అరుదైన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. స్వల్ప విష ప్రభావంతో పిల్లాడు ఆస్పత్రిపాలై చివరకు ప్రాణాలతో బయటపడటం అంతా నమ్మశక్యంకాని రీతిలో జరిగింది.


