Pahalgam Attack: పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యులైన నలుగురు ఉగ్రవాదులను భారత బలగాలను తాజాగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే పహల్గాం దాడి తర్వాత పరారైన ఉగ్రవాదుల జాడను.. శత్రు దేశం ద్వారానే మన వాళ్లు కనుగొనడం గమనార్హం. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం…
పహల్గాం ఉగ్రదాడులు డాచిగామ్లో ఉన్నట్లు తొలుత మే 22న ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో దాదాపు రెండు నెలలపాటు ఏజెన్సీలు అనేక మార్గాల్లో ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సెన్సర్లను కూడా వాడారు. మహాదేవ్ పర్వతం వద్దే వారు ఉన్నట్లు జులై 22నే పక్కాగా నిర్ధరించుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించడంలో.. మన దేశానికి మరో శత్రువుగా వ్యవహరిస్తోన్న చైనీస్ శాటిలైట్ ఫోన్ సిగ్నల్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. చైనాకు చెందిన, నిషేధిత T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్ ను ఉగ్రవాదులు ఉపయోగించారు. దాన్ని సిగ్నల్స్ అనుకోకుండా యాక్టివేట్ కావడంతో వారి ఆచూకీ బయటపడింది. అయితే ఈ ఫోన్ చైనాకు చెందిన హువావే నెట్వర్క్ ద్వారా పని చేస్తుంది.
అసలు విషయం ఏంటంటే ఉగ్రదాదులను పట్టించిన ఈ T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్లను భారత్ 15 ఏళ్ల కిందటే నిషేధించింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనీస్ టెలికాం సంస్థలైన హువాయ్, ZTE ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఫోన్లు చైనాకు చెందిన టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్వర్క్ ద్వారా రహస్య కమ్యూనికేషన్కోసం అనుసంధానం చేయబడ్డాయి. కానీ గత వారం చివర్లో ఈ ఫోన్ల సిగ్నల్స్ యాక్టివేట్ కావడంతో ఢిల్లీలోని యూనిట్లు ఈ సిగ్నల్ను గుర్తించాయి. దీంతో భారత బలగాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి.
జులై 28న మన సైన్యం డ్రోన్లతో డచిగం అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. 9:30కు పర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 11:15కు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. ఆ కొద్ది సేపటికే మరో ముగ్గుర్ని మట్టుబెట్టారు. మొత్తం ఆపరేషన్ 90 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి అయింది. అంటే భారత బలగాలు శత్రువులను వేటాడటమే కాకుండా, వారి టెక్నాలజీని వారికే ఉచ్చుగా మార్చి మరీ హతమర్చారు. ఈ ఆపరేషన్లో అత్యుత్తమైన టెక్నాలజీ వినియోగం జరిగిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.


