CJI BR Gavai: సుప్రీంకోర్టులో సోమవారం ఓ కేసులో వాదనలు జరుగుతుండగా సీజేఐ బీఆర్ గవాయ్పై రాకేష్ కిషోర్ అనే లాయర్ తన షూ విసిరిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రధాని సైతం తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తనపై జరిగిన దాడిపై తాజాగా సీజేఐ స్పందించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/high-court-stay-on-bc-reservations/
ఆరోజు జరిగింది చూసి షాక్ అయిపోయానని.. ఆ ఘటనను ‘మర్చిపోయిన ఛాప్టర్’గా భావిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ”సోమవారం జరిగిన ఘటనతో నేను, నా సహచర జడ్జి షాక్ అయ్యాం. అయితే ఇది మాకు మర్చిపోయిన అధ్యాయం” అని సీజేఐ పేర్కొన్నారు. అయితే ఆ ఘటనను జోక్గా తీసుకోవద్దని జస్టిస్ ఉజ్జన్ భూయాల్ అన్నారు. సీజేఐపై దాడికి యత్నం ఘటన క్షమార్హం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు.
కాగా, లాయర్ రాకేష్ కిషోర్(71)ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బహిష్కరించడంతో పాటు ఆయన భవిష్యత్తులో మళ్లీ కోర్టులో అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేశామని గురువారం అధికారికంగా ప్రకటించింది. ఘటన జరిగిన తర్వాత 3 గంటల విచారణ అనంతరం పోలీసులు లాయర్ను వదిలేయగా.. సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ ముందుగా రాకేష్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే గురువారం అతడిని బహిష్కరిస్తున్నట్లు బార్ అసోషియేషన్ ప్రకటించింది.


