Monday, March 31, 2025
Homeనేషనల్CBN: ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీని మార్చుతాం: సీఎం చంద్రబాబు

CBN: ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రంగా ఏపీని మార్చుతాం: సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, 1995లో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-(AIRSS) 2025కు సీఎం చంద్రబాబు (CM Chandra Babu)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

- Advertisement -

ప్రపంచం చూపు ఇక భారత్ వైపే
1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. చైనా ఆర్థిక సంస్కరణలతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటిష్ పాలకులు మనం దేశం నుంచి వెళ్తూవెళ్తూ ఇంగ్లీష్ భాషను మనకు వదిలేసి పోయారు. ఏపీలోని కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకెళ్లారు. టెలికాం రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ ఆధిపత్యం ఉండేది. సంస్కరణలు రావడంతో ప్రైవేట్ సంస్థలు కూడా టెలికాం రంగంలోకి వచ్చాయి. ఇదొక గేమ్ ఛేంజర్ అయింది. ప్రస్తుతం ప్రపంచం చూపు భారతదేశం వైపు మళ్లింది. రాబోయే రోజులంతా భారతదేశానివే. ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ కొత్త ఆవిష్కరణలు,స్టార్టప్ అగ్నికుల్ కోస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి స్టార్టప్‌ల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లు దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యాయి. ఈ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం దాకా ఉన్నారు.’ అని సీఎం అన్నారు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
‘1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాక తర్వాత బిల్ గేట్స్‌ను కలవాలని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సత్సంబంధాలు లేవని, కలవడం కుదరదని అన్నారు. అయినప్పటికీ ఆయనతో సమావేశం కావాలని ఒప్పించి దాదాపు 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ స్థాపించాలని బిల్ గేట్స్‌ను కోరాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉన్నారు. 2014లో భారత్ పదో ఆర్ధిక వ్యవస్ధగా ఉండేది. ఇప్పుడు ఐదవ స్థానానికి ఎగబాకింది. మనమంతా మరింత కృషి చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది.

అక్కడ తెలుగు, తమిళులే ఎక్కువ
భారతదేశానికి జనాభా గొప్పవరం లాంటింది. మన దేశానికి ఇంకో 40 ఏళ్ల దాకా జనాభా సమస్య ఉండదు. దక్షణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాల్సి ఉంది. అమెరికా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం మన దేశీయులదే. అక్కడి ధనిక ప్రాంతాల్లోకి వెళ్లి చూస్తే తెలుగు, తమిళం వారే ఎక్కువ మంది ఉంటారు. భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్‌లలో భారతీయుల ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు.

ఎనర్జీ రంగంలో ఏపీ ముందు
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. భవిష్యత్తులో ఏపీ రూ.2 రూపాయలకే యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉంటే, ఇందులో 160 గిగావాట్లు ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎనర్జీలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ స్థాపిస్తోంది. రిలయన్స్ బయోఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. రాబోయే రెండేళ్లలో 20 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నాం.

అభివృద్ధి సాధించాలంటే సుస్థిర పాలన అవసరం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తాం. భారతదేశం డేటా సేకరణలో ముందుంది. నేను చేతి వేలుకు పెట్టుకున్న రింగ్ నా ఆరోగ్యం ఎలా ఉందో కూడా ట్రాక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్‌కు కేంద్రంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ అవకాశాలను కల్పిస్తాం. భారతదేశ ఆధునిక టెక్నాలజీ, సరైన నాయకత్వంతో అభివృద్ధి చెందుతుంది.’ అని సీఎం అన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ… సైబరాబాద్ అభివృద్ధికి మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు అని ప్రశంసల వర్షం కురింపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News