Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జెన్ జెడ్ యువత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ డిజిటల్ ఉద్యమానికి నాంది పలికాయి. ఈ పార్టీకి సోషల్ మీడియాలో యువతరం బ్రహ్మరథం పడుతోంది. ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్కు గురువారం నాటికి 10.5 మిలియన్స్ (కోటి 50 లక్షలు) ఫాలోవర్స్ను సంపాదించిందంటే దీనికున్న క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు.
Also read: Jairam Ramesh: ‘మోదీకి మెలోడీల ముచ్చట.. దేశ ఆర్థిక వ్యవస్థ అగచాట్లు’
నిరుద్యోగులు, సోమరులకే పార్టీలో సభ్యత్వం..
అసలు, ఈ కొత్త పార్టీ ఎలా పురుడు పోసుకుంది? ఈ పార్టీ ఉద్దేశ్యమేంటి? ఎందుకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది? అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తిరంగా మారాయి. ఓ కేసు విచారిస్తున్న సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువత సోమరులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు లేని యువకులు బొద్దింకల్లాగా తయారవుతున్నారని, వీళ్లందరూ ఆర్టీఐ కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి వ్యవస్థలను విమర్శిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. నిరుద్యోగ యువత నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలతో ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తుంది కాబట్టి, ఆ బొద్దింకలన్నీ కలిసి ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థి, మాజీ పొలిటికల్ సోషల్ మీడియా వాలంటీర్ అభిజీత్ దిప్కే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కాన్వా (కాన్వా) డిజైన్ల సాయంతో రాత్రికి రాత్రే ఆయన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) పేరుతో వ్యంగ్యంగా ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమను తాము ‘సోమరులు, నిరుద్యోగుల గొంతుక’గా ప్రకటించుకున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ.. తమ సిద్ధాంతాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరి)’ అని పిలుచుకుంటోంది. అంతేకాదు, ఈ పార్టీ ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను కూడా సెటప్ చేసింది. ఇందులో పార్టీలో సభ్యత్వం పొందేందుకు కొన్ని కండీషన్స్ పెట్టింది. ఇందులో చేరేవారు నిరుద్యోగి అయి ఉండాలని, బద్ధకంగా ఉండాలని, 24 గంటలు ఆన్లైన్లో ఉంటూ విమర్శలు చేయాలని పేర్కొంది.
Also Read: Revanthreddy : బండి భగీరథ్ లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా? అసలు నిజం బయటపెట్టిన సీఎం రేవంత్
ఐదు పాయింట్లతో మేనిఫెస్టో రిలీజ్..
కాగా, ఈ పార్టీ తన వెబ్సైట్లో 5 పాయింట్లతో ఓ మేనిఫెస్టోను కూడా పెట్టింది. రిటైర్డ్ సీజేఐలకి రాజ్యసభ సీటు ఉండదు. డీలిమిటేషన్ పేరుతో ఓట్లు అక్రమంగా తొలగిస్తే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం. అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను పూర్తిగా రద్దు చేసి, ఆయా ఛానెళ్లలో పనిచేసే యాంకర్ల ఆర్థిక లావాదేవీలను చెక్ చేయడం. అలాగే పార్లమెంటులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజా ప్రతినిధులు 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం.. వంటివి ఉన్నాయి.

