Congress in Tamil Nadu cabinet: తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో దాదాపు 59 ఏళ్ల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి కాబోతోంది.
మెజార్టీకి కొద్ది దూరంలో నిలిచిన విజయ్ పార్టీ అధికారం చేపట్టేందుకు మద్ధతు ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు బహుమతిగా మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి గెలిచిన మొత్తం ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పీ విశ్వనాథన్ ఇద్దరూ గురువారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు గానూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరడం చరిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు.
59 ఏళ్ల తర్వాత కేబినెట్లోకి..
కాగా, తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో జతకట్టి పోటీ చేసిన కాంగ్రెస్ మొత్తం ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ టీవీకేకు దక్కకపోవడంతో ఆ పార్టీ డీఎంకేకి హ్యాండిచ్చి టీవీకేతో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలోనే విజయ్ మంత్రివర్గంలో రెండు బెర్తులను కన్ఫర్మ్ చేసుకుంది. ఎట్టకేలకు 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు కేబినెట్లో చోటు దక్కించుకోవడంపై హస్తం పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

