Raids Retired Chief Engineer: ఆ ఇల్లు ఓ ఇంద్రభవనం, ప్రైవేట్ సామ్రాజ్యాన్ని తలపించే వ్యవసాయ క్షేత్రం, అక్కడ రాజుల కాలం నాటి వైభవం తలపించేలా కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు, దేవతల కోసం అమృతం సిద్ధం చేసినట్లుగా టన్నుల కొద్దీ తేనె, లగ్జరీ కార్లు, అధునాతన సౌకర్యాలు.. ఇవన్నీ చూసి ఇదంతా ఏ పారిశ్రామిక వేత్తకి చెందినదో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించి ప్రజా సొమ్మును దండుకున్న ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ అక్రమ ఆస్తుల చిట్టా..
Also Read: https://teluguprabha.net/national-news/supreme-court-rejects-pil-cough-syrup-deaths-vishal-tiwari/
పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్ అక్రమ ఆస్తులను చూసి అధికారులే ఖంగు తిన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రజాపనుల విభాగంలో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి రిటైర్ అయిన జీపీ మెహ్రా లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక ఉన్న కరెప్షన్ స్టోరీ ఇది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు లోకాయుక్త అధికారుల దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో భోపాల్, నర్మదాపురంలోని మెహ్రా నివాసాల్లో ఏకకాలంగా తనిఖీలు చేపట్టిన లోకాయుక్త అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
నలుగురు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో జీపీ మెహ్రా నివాసాల్లో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహించారు. మణిపురంలోని నివాసంలో రూ. 8.79 లక్షల నగదు, రూ. 50 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతటితో కథ అయిపోలేదు. దనాపానీలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్టుమెంట్ ఉందని గుర్తించిన అధికారులు.. అక్కడ తనిఖీలు చేయగా ఆ వైభవం చూసి షాక్ అయ్యారు.
Also Read: https://teluguprabha.net/national-news/post-office-national-savings-certificate-double-profit/
ఆ అపార్ట్మెంట్లో భారీగా నోట్ల కట్టలు, రూ. 3 కోట్ల విలువచేసే 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. ఇక నర్మదాపురంలో మెహ్రాకు చెందిన ఫామ్హౌస్కు వెళ్లగా అక్కడ ఆయన విలాసాలు చూసి అధికారులకే కళ్లు చెదిరాయంటే అతిశయోక్తి కాదు. 32 అధునాతన కాటేజీలు నిర్మాణ దశలో ఉన్న ఆ విశాలమైన వ్యవసాయ క్షేత్రంలో మరో 7 కాటేజీలు పూర్తయ్యాయి. చెరువు, గోశాల, ఆలయం, నాలుగు లగ్జరీ కార్లతో ప్రైవేట్ సామ్రాజ్యాన్ని తలపించేలా ఉంది.
ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మెహ్రా వ్యవసాయ క్షేత్రంలో ఏకంగా 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనం తెలిపింది. అయితే అనుమతి లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని అక్రమాస్తులు చూసి ఖంగుతున్న అధికారులు.. మెహ్రా ఆస్తులపై దర్యాప్తు చేపట్టారు. ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని.. మొత్తంగా ఆయన సంపద రూ. వందల కోట్లలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంకు రికార్డులు, డిజిటల్ ఫైళ్లను ఫోరెన్సిక్ బృందాలు తనిఖీ చేస్తున్నాయని వెల్లడించారు. చివరగా మెహ్రా బినామీ పెట్టుబడులపైనా అధికారులు దర్యాప్తులో ఇక ఎన్ని అక్రమార్జనలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.


