DK Shivakumar Plans to Oath as Karnataka CM: కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ శుక్రవారం ఆమోదముద్ర వేయటంతో సిద్దూ కేబినెట్ రద్దయింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య శుక్రవారం వారితో భేటీ అయ్యారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రస్తుత డిప్యూటీ సీఎం, కాబోయే సీఎం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలందరితో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకార తేదీపై చర్చించారు.
Also Read: CP Sajjanar: లాయర్ మొహిజుద్దీన్ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..!
నేటి సీఎల్పీ సమావేశంలో ఎన్నిక..
తదుపరి సీఎంను ఎన్నుకునేందుకు శనివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించాలని ఏఐసీసీ తీర్మానించింది. సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో నిర్వహించే ఈ సమావేశానికి శాసనసభ్యులంతా హాజరుకావాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఆదేశాలు జారీ చేసింది. కొత్త సీఎం ఎన్నికను పర్యవేక్షించేందుకు అధిష్ఠానం నుంచి పర్యవేక్షకులుగా కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా హాజరవుతారు. సిద్ధరామయ్యతో పాటు బోసురాజు, కేపీసీసీ కార్యదర్శి అల్లమప్రభ పాటిల్ పాల్గొననున్నారు. శాసనసభా పక్ష నేతను ఎన్నుకున్న అనంతరం డీకే శివకుమార్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.
Also Read: Khushboo Meets Modi: ప్రధాని మోదీని కలిసిన సినీ నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?
జూన్ 5లోపే ప్రమాణస్వీకాారం?
ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయడం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే, ఆయన ప్రమాణస్వీకారానికి స్పష్టమైన తేదీ ఇంకా ఖరారవ్వకపోయినా జూన్ 5లోపు ఆ ఘట్టం ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభించారు. మరోవైపు, కొత్త మంత్రివర్గ కూర్పు హైకమాండ్ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. ఢిల్లీ వెళ్లినప్పుడే సిద్ధరామయ్య తన తరఫున మంత్రుల జాబితాను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు అందించారు. తన కుమారుడు యతీంద్రకు కీలక శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. డీకే కేబినెట్లో.. సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రుల్లో దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు ఉండదని సమాచారం. ఇక సామాజికవర్గాల సమతుల్యాన్ని పాటించేందుకు గానూ నాలుగు ఉపముఖ్యమంత్రి పదవులు సృష్టించాలని ఏఐసీసీ ఆలోచిస్తోంది. కొత్త సర్కారు ప్రమాణస్వీకారం అనంతరం కేపీసీసీ కార్యవర్గంలోనూ మార్పులు, చేర్పులు చేయనుంది.

