Supreme Court Questions Govt On Illegal Immigrants: అక్రమ వలసదారుల సమస్యపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా తరహాలో సరిహద్దు గోడను నిర్మించాలని అనుకుంటున్నారా? అని ధర్మాసనం సూటిగా అడిగింది. బెంగాలీ, పంజాబీ మాట్లాడే భారతీయులకు పొరుగు దేశాలతో ఉన్న భాషాపరమైన, సాంస్కృతిక వారసత్వాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఈ సమస్యపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరింది.
ALSO READ: Bihar Voter List: బీహార్లో ఓట్ల భూకంపం.. జాబితాలో అఫ్గాన్.. బంగ్లా వాసుల కలకలం!
పశ్చిమ బెంగాల్ మైగ్రెంట్ వెల్ఫేర్ బోర్డ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ఈ చర్చ జరిగింది. బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను బంగ్లాదేశీయులని అనుమానిస్తూ నిర్బంధిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఈ పిటిషన్ వెనుక కొంతమంది స్వార్థపరులు ఉన్నారని, అక్రమ వలసదారులతో డెమోగ్రాఫిక్ మార్పులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భాష, సంస్కృతి వారసత్వం సరిహద్దులకు అతీతమైనవి..
న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, “అమెరికా తరహాలో గోడ కట్టాలనుకుంటున్నారా?” అని అడగగా, “ఖచ్చితంగా కాదు, కానీ దీని వెనుక వ్యక్తిగత ఫిర్యాదుదారులు లేరు” అని మెహతా బదులిచ్చారు. దీనిపై జస్టిస్ బాగ్చి స్పందిస్తూ, జాతీయ భద్రత, వనరుల సంరక్షణతో పాటు, భాష, సంస్కృతి వారసత్వం సరిహద్దులకు అతీతమైనవని గుర్తు చేశారు.
ALSO READ: Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ హోదా.. సుప్రీంకోర్టు నోటీసులు
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బెంగాలీ మాట్లాడేవారిని బంగ్లాదేశ్ లోకి బలవంతంగా నెట్టేస్తున్నారని, ఒక్కోసారి BSF జవాన్లు వారిని బెదిరిస్తున్నారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, దేశంలో ఉన్న వ్యక్తుల విషయంలో కొన్ని నిర్దిష్ట నియమాలు పాటించాలని, వారిని బలవంతంగా సరిహద్దు దాటించకూడదని సూచించింది. అక్రమ వలసదారుల సమస్యను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలపై స్పష్టమైన నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ALSO READ: Mohan Bhagwat: “మనం ఇద్దరం, మనకు ముగ్గురు.. ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లల్ని కనాలి”


