Delhi Airport: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతుండటంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ దేశంలోకి వ్యాపించకుండా నిరోధించేందుకు అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు.
ఆ దేశాల నుంచి వచ్చే వారు అప్రమత్తం: ముఖ్యంగా ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ ల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎయిర్పోర్టు అధికారులు స్పష్టం చేశారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే చెప్పండి: ప్రయాణికుల్లో ఎబోలా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపిస్తే దాచకుండా తక్షణమే రిపోర్ట్ చేయాలని అధికారులు కోరారు.
- జ్వరం
- తీవ్రమైన తలనొప్పి
- విపరీతమైన నీరసం
- కండరాల నొప్పులు
21 రోజుల నిఘా: ఒకవేళ విమానాశ్రయంలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. సదరు దేశాల నుంచి భారత్కు చేరుకున్న 21 రోజుల్లోగా పైన పేర్కొన్న లక్షణాలు ఎప్పుడు కనిపించినా ప్రయాణికులు వెంటనే స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించి సమాచారం అందించాలని విమానాశ్రయ ఆరోగ్య సంస్థ (APHO) సూచించింది. దేశంలోకి మహమ్మారి ప్రవేశించకుండా ఉండేందుకు ప్రయాణికులు అధికారులకు సహకరించాలని కోరారు.
Also read-Ebola Virus: ఎబోలా కలకలం..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్వో
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్వో: ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola virus) మళ్లీ కోరలు చాస్తోంది. కాంగోతో పాటు పొరుగున ఉన్న ఉగాండా దేశంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు మే 17న డబ్ల్యూహెచ్వో అధికారికంగా ప్రకటించింది.
వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన: 1976లో కాంగోలో ఎబోలా వైరస్ను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి.. అక్కడ ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం ఇది 17వ సారి కావడం గమనార్హం. ప్రస్తుతం కాంగోలో సేకరించిన ప్రాథమిక నమూనాలలో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదు కావడంతో పాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం వైద్య నిపుణులను కలవరపెడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ ఎబోలా స్ట్రెయిన్కు (Bundibugyo virus) ప్రత్యేకంగా ఆమోదించబడిన చికిత్సలు కానీ, వ్యాక్సిన్లు కానీ అందుబాటులో లేవు. దీంతో వైరస్ను తక్షణమే అరికట్టడం ఒక సవాల్గా మారిందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.

