Digital Addiction: ఆర్థిక సర్వే 2026 భారత యువత భవిష్యత్తుపై ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ‘డిజిటల్ వ్యసనాన్ని’ (Digital Addiction) చరిత్రలో మొదటిసారిగా ఒక జాతీయ ప్రజారోగ్య సమస్యగా ఈ సర్వే గుర్తించింది. టెక్నాలజీ వాడకం మితిమీరటం కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని.. అది దేశ ప్రొడక్టివిటీపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదమని మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు, యువత ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోవడం అంటే మెుబైల్స్, కంప్యూటర్లు, టీవీ చూస్తూ గడపటం వల్ల వారి మానసిక స్థితి క్రమంగా క్షీణిస్తోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ప్రజల్లో నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు యువతలో మేధోపరమైన క్షీణతకు దారితీస్తున్నాయని నివేదిక వెల్లడించింది. కేరళ, తమిళనాడు వంటి డిజిటల్గా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో సోషల్ డిస్టెన్సింగ్ అనే కొత్త ట్రెండ్ కనిపిస్తోందని, ఆన్లైన్ ప్రపంచంలో మునిగిపోవడం వల్ల వాస్తవ ప్రపంచంలో సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయని సర్వే హెచ్చరించింది.
also read Rubina Dilaik: ప్రెగ్నెంట్ అని చెప్పిన బుల్లితెర నటి.. నెటిజన్లలో కొత్త అనుమానాలు పుట్టించిన పోస్ట్
మరోవైపు జనరేటివ్ AI వాడకంపై కూడా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు క్రియేటివిటీని పక్కనపెట్టి, విశ్లేషణాత్మక పనుల కోసం పూర్తిగా ఏఐ మోడల్స్పై ఆధారపడటం వల్ల వారిలో సొంతంగా ఆలోచించే శక్తి నశిస్తోందని అభిప్రాయపడింది. ఇది భవిష్యత్తులో దేశ పనిశక్తి నాణ్యతను తగ్గించే అవకాశం ఉందని, తద్వారా జాతీయ ఉత్పాదకత దెబ్బతింటుందని సర్వే పేర్కొంది. అల్గారిథమ్ ఆధారిత సోషల్ మీడియా వాడకం డిజిటల్ వ్యసనంగా మారి యువతను డెమోగ్రాఫిక్ డివిడెండ్ నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం డిజిటల్ వెల్నెస్ కరికులమ్ పేరుతో పాఠశాలల్లో ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. టెక్నాలజీని పూర్తిగా నిషేధించకుండా.. దాని వినియోగాన్ని క్రమబద్ధీకరించడం ఈ వ్యూహం ఉద్దేశం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యూత్ హబ్స్ ఏర్పాటు చేయడం, కార్యాలయాల్లో టెక్నాలజీ-ఫ్రీ జోన్స్ ప్రోత్సహించడం, డిజిటల్ డిటాక్స్ సెంటర్ల ద్వారా యువతను తిరిగి వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడం వంటి చర్యలను ప్రభుత్వం సిఫార్సు చేసింది. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే.. కేవలం డిజిటల్ వృద్ధి మాత్రమే సరిపోదని, దేశ ప్రజల మానసిక ఆరోగ్యం కూడా అత్యంత కీలకమని తాజా సర్వే నొక్కి చెప్పింది.

