Parliament Budget Session MPs Suspension: వాయిదా అనంతరం లోక్సభలో మరోసారి గందరగోళం నెలకొంది. స్పీకర్పై విపక్ష సభ్యులు కాగితాలు చించి విసిరారు. దీంతో ఆరుగురు విపక్ష సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వరసగా రెండో రోజు లోక్సభ మరోసారి రేపటికి వాయిదా పడింది. ఇప్పటికే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బీజీపీ ఎంపీ విమర్శలు వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడి 3 గంటలకి తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ కాసేపటికే లోక్సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు.
స్పీకర్పై విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో 8 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఉన్నారు. ఈ సెషన్ ముగిసేంతవరకు విపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతుంది. స్పీకర్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘించడమేనని.. బడ్జెట్ సమావేశాల్లో ఇటువంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
నిరసన వ్యక్తం..
ఎనిమిది మంది పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. దీనిని “హాస్యాస్పదం” అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో, ప్రతి సభ్యునికి మాట్లాడే హక్కు ఉండాలని వారి ఆందోళనలను వినాలని పేర్కొన్నారు. మరోవైపు ఎంపీల సస్పెన్షన్, భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

