Saturday, November 15, 2025
Homeనేషనల్Election Commission : రాహుల్ 'ఓట్ల చోరీ' ఆరోపణలు నిరాధారం.. ఆన్‌లైన్‌లో తొలగించడం అసాధ్యం: ఈసీ...

Election Commission : రాహుల్ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు నిరాధారం.. ఆన్‌లైన్‌లో తొలగించడం అసాధ్యం: ఈసీ కౌంటర్

Election Commission on Rahul Gandhi’s allegations : “సాఫ్ట్‌వేర్ వాడి ఓట్లను దొంగిలిస్తున్నారు!” – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఈ సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కొట్టిపారేసింది. ఆన్‌లైన్ ద్వారా ఒకరి ఓటును మరొకరు తొలగించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. అసలు రాహుల్ ఏమని ఆరోపించారు..? దానికి ఈసీ ఇచ్చిన వివరణ ఏంటి..?

- Advertisement -

అసలేం జరిగిందంటే : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఎన్నికల సంఘంపై, ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల తొలగింపు: “ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, కేంద్రీకృత పద్ధతిలో, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగిస్తున్నారు,” అని ఆయన ఆరోపించారు.

కర్ణాటక ఉదంతం: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వేలాది మంది ఓట్లను ఇలాగే తొలగించారని, దీనిపై సీఐడీ దర్యాప్తుకు ఈసీ సహకరించడం లేదని విమర్శించారు.

ఈసీ కొట్టివేత.. పక్కాగా వివరణ : రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో, ఓటు తొలగింపు ప్రక్రియ గురించి స్పష్టంగా వివరించింది.

“సంబంధిత వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా ఏ ఒక్కరి ఓటునూ తొలగించలేం. ఆన్‌లైన్ ద్వారా మరెవరూ ఇతరుల ఓటును తొలగించడం అసాధ్యం. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు.”
– కేంద్ర ఎన్నికల సంఘం

2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఇలాంటి విఫల ప్రయత్నాలు జరిగాయని, ఆ వ్యవహారంపై ఎన్నికల సంఘమే స్వయంగా ఫిర్యాదు చేసి, దర్యాప్తు చేయించిందని ఈసీ గుర్తుచేసింది.

బీజేపీ ఫైర్.. “దేశంలో అశాంతికి కుట్ర” : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “వరుసగా 90 ఎన్నికల్లో ఓడిపోయిన అసహనంతో రాహుల్, బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతిని భారత్‌లో సృష్టించాలని చూస్తున్నారు,” అని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

“రాహుల్‌కు రాజ్యాంగం, చట్టంపై అవగాహన లేదు. ఆయన వ్యాఖ్యలు దేశ ప్రజలను, ఓటర్లను అవమానించడమే,” అని మరో మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.
ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరుగుతుందని, ఇలాంటి నిరాధార ఆరోపణలతో ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు అపనమ్మకం కలిగించవద్దని ఎన్నికల సంఘం హితవు పలికింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad