Vijay Rupani Dead Body Found: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani)ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబసభ్యులు డీఎన్ఏతో రూపానీ డీఎన్ఏ సరిపోలింది. డీఎన్ఏ టెస్టుకు సంబంధించిన ఫలితాల అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. దీంతో స్వగ్రామం రాజ్కోట్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇక ఇప్పటిదాకా 32 మంది మృతుల డీఎన్ఏ వారి కుటుంబసభ్యుల డీఎన్ఏతో సరిపోలినట్లు బీజే మెడికల్ కాలేజీ సీనియర్ వైద్యులు తెలిపారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. అలాగే పరీక్షతో పనిలేకుండా గుర్తుపట్టిన 8 మృతదేహాలను కూడా వారి కుటుంబసభ్యులకు ఇచ్చామన్నారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు మాత్రం డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో డీఎన్ఏ పరీక్షకు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతున్నందున వల్ల గుర్తింపు ఆలస్యం అవుతోందని తెలిపారు.
కాగా జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. విమానం పడిన జీజీ మెడికల్ కాలేజీకి చెందిన 38 మంది మెడికోలు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 279కి చేరింది. ఈ దుర్ఘటన దేశ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా మిగిలిపోయింది.
Vijay Rupani: మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
- Advertisement -