Aadhar: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చిన్నారుల ఆధార్ విషయంలో కీలక అప్ డేట్ ఇచ్చింది. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆధార్లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్ డేట్స్ చేసేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి స్కూల్స్ లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా పెండింగ్లో ఉన్న బయోమెట్రిక్ అప్ డేట్ ను పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు యూఐడీఏఐ చీఫ్ భువనేష్ కుమార్ లేఖ రాశారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం యూఐడీఏఐ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్ మెంట్ తో కలిసి పనిచేస్తుంది. ఇందులో భాగంగా స్కూల్ విద్య సమాచార వ్యవస్థ అయిన యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్లో విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఏ విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ అవసరమో స్కూళ్లకు తెలుస్తుంది. దీనివల్ల దాదాపు 17 కోట్ల మంది విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్లు ఈజీగా పూర్తి చేయవచ్చు.
Read Also: Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఎక్కువ కోచ్లతో వందేభారత్ రైళ్లు
ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్
పిల్లలకు ఐదేళ్లు వచ్చినతర్వాత ఆధార్లో బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధార్ డేటా కచ్చితత్వాన్ని, విశ్వసనీయత కాపాడుతుంది. బయోమెట్రిక్ అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి కంపిటేటివ్ పరీక్షలకు, యూనివర్సిటీ ఎంట్రీ పరీక్షలకు రిజిస్టర్ చేసుకునేటప్పుడు సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం స్కూల్లోనే అప్డేట్ చేయించుకోవచ్చు. దీంతో, ఈ ఇబ్బందులను నివారించవచ్చని యూఐడీఏఐ చెబుతుంది. కాగా దేశంలో పిల్లల ఆధార్ వివరాలు త్వరగా పూర్తి చేయాలని కేంద్రం తెలిపింది. దీనివలన భవిష్యత్తులో వారి కెరీర్ పరంగా ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్తోంది.
Read Also: Malaysia: మలేషియా నుంచి భారతీయులు వెనక్కి.. వివరణ ఇచ్చిన హైకమిషన్


