Noida Murder Case: గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదనపు కట్నం కోసం యువతిని సజీవదహనం చేసిన సంఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
అదనపు కట్నం కోసం..
సిర్సాకు చెందిన విపిన్ భాటితో నిక్కీ అనే మహిళ వివాహం జరిగినది తొమ్మిదేళ్ల క్రితం. పెళ్లైన కొన్ని రోజులకే అత్తింటి వారు ఆమెపై అదనపు కట్నం కోసం ఒత్తిడి ప్రారంభించారు. వారు నిక్కీ తల్లిదండ్రుల నుంచి మరో 36 లక్షల రూపాయలు తీసుకురావాలని పదే పదే ఒత్తిడి చేస్తూ వచ్చారు.
అయితే విపిన్, అతని కుటుంబ సభ్యులు నిక్కీని గదిలోకి లాగి కొట్టారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి లైటర్తో నిప్పంటించారు. ఆ సమయంలో నిక్కీ కుమారుడు భయాందోళనకు గురై ఏడుస్తూ తల్లి మీద జరిగిన దాడిని ప్రత్యక్షంగా చూశాడు. కన్నీళ్లతో పోలీసులకు చెప్పిన తన వాక్యాలు అందరినీ కదిలించాయి.
సోదరి కంచన్ కూడా..
ఈ సంఘటనలో నిక్కీ సోదరి కంచన్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఆమెను కూడా అదే కుటుంబానికి కోడలిగా పంపించారు. తనపైనా కట్న వేధింపులు కొనసాగించారని, ఘటన జరిగిన రోజున తనను కూడా దాడి చేశారని ఆమె తెలిపారు. కంచన్ మాట్లాడుతూ తాను అడ్డుకోవడానికి ప్రయత్నించినా తన చెల్లిని రక్షించలేకపోయానని, నేరస్థులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/mlc-veerendra-arrested-by-ed-sezied-6-crored-gold/
ఈ దారుణ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో నిక్కీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ కొడుతున్న దృశ్యాలు, మంటల్లో తగలబడి బయటకు పరుగులు తీస్తూ మెట్లపై నుంచి దిగివస్తున్న నిక్కీ దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిక్కీని స్థానికులు మొదట ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్త తెలిసిన క్షణాల్లోనే స్థానికులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ వద్ద చేరి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఆందోళన చేపట్టారు.
మిగతా నిందితులు…
నిక్కీ సోదరి కంచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కస్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. భర్త విపిన్ భాటి, మామ సత్వీర్, అత్త దయా, బావమరిది రోహిత్ భాటి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. విపిన్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సోషల్ మీడియాలో..
ఇంతలో, ఈ దారుణం తర్వాత విపిన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు మరింత వివాదాస్పదమయ్యాయి. భార్య ఆత్మహత్య చేసుకుందని చూపించేలా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసి తాను బాధితుడినని చూపించేందుకు ప్రయత్నించాడు. ఒక వీడియోలో భార్యను ఉద్దేశించి “ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, ప్రపంచం నన్ను హంతకుడిగా చూస్తోంది” అంటూ వ్రాశాడు. మరో పోస్ట్లో భార్య, పిల్లలతో కలిసి ఉన్న వీడియోను పెట్టి “నేను సర్వనాశనమయ్యాను” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టులు చూసిన వారంతా విపిన్ నాటకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
నిక్కీ కుమారుడు కూడా స్పష్టంగా తల్లి మీద దాడి చేసిన వ్యక్తుల పేర్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత నిప్పంటించారని అతని వాక్యాలు నిర్ధారిస్తున్నాయి. చిన్నారి మాటలు వినగానే కేసు దిశ మరింత బలపడిందని విచారణాధికారులు చెబుతున్నారు.
కుటుంబ అంతర్గతంగా ఇద్దరు సోదరీమణులను ఒకే ఇంటికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వారిపై జరిగే కట్న వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. కంచన్ 2016లో అదే కుటుంబంలోకి వెళ్లింది. అప్పటి నుంచి తనకు కూడా ఆర్థిక ఒత్తిడి, శారీరక వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె తెలిపింది. గురువారం జరిగిన దాడి తర్వాత తాను కూడా గాయపడినట్లు పోలీసులకు వివరించింది.
స్థానికులు మాట్లాడుతూ కట్నం కోసం ఇంత కిరాతకంగా హత్య చేయడం అసహనానికి గురిచేస్తోందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.


