GST Cut On HUL Products: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో పలు కీలక సంస్కరణలు చేస్తూ సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రంగంలో జీఎస్టీని మినహాయిస్తూ భారీ ఊరటను కలిగించింది. పలు వస్తువులు, ఉత్పత్తులపై చాలా మేరకు జీఎస్టీ రేట్లను కేంద్రం తగ్గించింది. ఈ ప్రభావంతో ప్రముఖ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ పలు ప్రొడక్టుల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.
జీఎస్టీ రేట్ల సవరణల నేపథ్యంలో కేంద్రం 12, 28 శాతం శ్లాబుల్ని ఎత్తివేసింది. దీంతో చాలా వస్తువులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి, 12 శాతం నుంచి 5 శాతానికి చేరాయి. ఫలితంగా పలు వస్తువులు, ఉత్పత్తుల రేట్లు తగ్గుతున్నాయి. కాగా, చిన్న కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి చేరడంతో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇంకా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ 18 నుంచి 0 శాతానికి చేరింది.
భారీ తగ్గింపు ప్రకటించిన హెచ్యూఎల్
నిత్యావసర వస్తువుల ధరలపై జీఎస్టీ తగ్గింపు ప్రకటనతో తాజాగా హిందుస్థాన్ యూనిలీవర్(HUL) కీలక ప్రకటన చేసింది. పలు కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గించినట్లు ప్రకటించింది. ఫుడ్స్, బేవరేజెస్, క్లీనింగ్ ఏజెంట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా ఎన్నో వస్తువుల తయారీలో ఉన్న ఈ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG).. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని కస్టమర్లకు పూర్తి స్థాయిలో అందించనున్నట్లు ప్రకటించింది.
22 నుంచి అమల్లోకి
ధరలు తగ్గించిన వాటిల్లో డవ్ షాంపూ, హార్లిక్స్, కిసాన్ జామ్, బ్రూ కాఫీ, లక్స్, లైఫ్బాయ్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ పేర్కొంది.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-teacher-ai-morphing-principal-obsession-arrest/
ఏయే ఉత్పత్తులపై తగ్గనున్నాయి
ధరల తగ్గింపు ప్రభావంతో 340 మిల్లీలీటర్ డవ్ షాంపూ బాటిల్.. గతంలో రూ. 490 గా ఉండగా.. ఇప్పుడు రూ. 435 కి చేరింది. 200 గ్రాముల హార్లిక్స్ జార్ రూ. 130 నుంచి రూ. 110 కి తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 200 గ్రాముల కిసాన్ జామ్ రూ. 90 నుంచి రూ. 80 తగ్గగా.. 75 గ్రాముల లైఫ్బాయ్ సోప్ ధర రూ. 68 నుంచి రూ. 60 కి చేరింది. క్లోజప్ టూత్పేస్ట్ 150 గ్రా.పై రూ. 145 ఉండగా.. తగ్గింపుతో రూ. 129 కి లభిస్తుందని పేర్కొంది.
త్వరలో కొత్త స్టాక్
కాగా, రూ. 10, రూ. 20 ప్యాక్ల ధరలు మాత్రం స్థిరంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్యాకింగ్లో మార్పులు జరుగుతున్నాయి. ఇక, కొత్త స్టాక్కే కాకుండా ఇప్పటికే మార్కెట్లో ఉత్పత్తుల ఎమ్మార్పీని మార్చుకునే వెసులుబాటును సైతం కేంద్రం కల్పించింది. కొత్త ఎంఆర్పీ ధరలతో లేదా క్వాంటిటీ పెంపుతో కొత్త స్టాక్ను త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హెచ్యూఎల్ స్పష్టం చేసింది.


