Assam floods: అస్సాం రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. రోజురోజుకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 5.4 లక్షల మంది ప్రజలు ఈ వరద ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగంలోకి భారత సైన్యం: వరద పరిస్థితి నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత సైన్యం రంగంలోకి దిగింది. ముంపు ప్రాంతాల్లో సహాయక, రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది. వరద నీటిలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా పౌరులను సైన్యం అత్యంత ప్రాణాంతక పరిస్థితుల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెస్క్యూ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, వరద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాయి. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు ఆహారం, మంచినీరు అందించేలా స్థానిక యంత్రాంగం, సైన్యం సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి

