Jaitapur: దేశ రాజధానిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జైత్పూర్ ప్రాంతంలోని హరినగర్ లో ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 8 మంది మృతి చెందారు.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పలు విషయాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముట్టు అలీ (45), రబీబుల్ (30), షబీబుల్ (30), రుబీనా (25), డాలీ (25), హషిబుల్, రుఖ్సానా (6), హసీనా (7) లను మృతులుగా గుర్తించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గోడ పూర్తిగా నానిపోయింది. శనివారం ఉదయం గోడ కూలింది. గోడ సమీపంలో నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సహాయంతో వారిని ఆసుపత్రికి చేరవేసే క్రమంలో వారంతా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కూలిపోయే స్థితిలో ఉన్న నివాసాలలో ఉండకూడదు అని అధికారులు సూచించారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేలా అక్కడి వారిని ఖాళీ చేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా పలుప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ ప్రాంత వాసులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
Read more: https://teluguprabha.net/national-news/aadhar-facial-authentication-19-crore-transactions-july-2025/
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. విమాన ప్రయాణికులు విమాన సర్వీసులకు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకుని తగిన సమయంలో విమానాశ్రయానికి చేరుకోవాలని దిల్లీ ఎయిర్ పోర్టు అడ్వైజరీ సూచించింది. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించడమే కాకుండా విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది.


