Maharashtra Floods: భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలమవుతుంది. క్లౌడ్ బర్స్ట్ లతో జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉధృతంగా ప్రవహించిన నదులు, విరిగి పడిన కొండ చరియలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తవుతుంది.
రెండు రోజులుగా ముంబై నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రైలు మార్గాలు నీటితో నిండి, పలు ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. విమానాశ్రయం ప్రాంతంలో కూడా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.
Read more: https://teluguprabha.net/national-news/swachh-vidyalaya-puraskar-2025-26-application-guidelines/
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వరద నీరు చేరింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇండిగో, స్పైస్జెట్ వంటి ప్రముఖ ఎయిర్లైన్లు ప్రయాణికులకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశాయి. సామజిక మాధ్యమాల్లో ఎయిర్పోర్ట్ టర్మినల్ ప్రాంతాల్లో నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పలు విమానాలు ఆలస్యంగా పయనించగా, కొన్నింటిని రద్దు చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలు ముందుగానే తెలుసుకుని, అవసరమైతే విమాన సంస్థల అధికారిక వెబ్సైట్ లేదా హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
విక్రోలిలో మట్టిసరాయి కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షానికి నేలకూలిన నిర్మాణాలు, చెట్లు పడిపోవడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబై, రాయగడ్, థానే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోంకణ్ ప్రాంతంతో పాటు మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.
పూణేలో ఓ మహిళ మీద చెట్టు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బీడ్ లో వర్షపు నీటిలో ఒక వ్యక్తి మునిగి ప్రాణాలు కోల్పోయాడు. విదర్భ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాల కారణంగా 11 మంది మరణించగా, 2,000 కుటుంబాలు ఖాళీ చేయించబడ్డాయి. వేలాది ఇళ్లు పూర్తిగా నాశనం అయ్యాయి.
Read more:https://teluguprabha.net/national-news/independence-day-celebration-floods-jharkhand-patriotism/
మహారాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి సంబంధిత జిల్లాలకు తాత్కాలిక సహాయం అందిస్తోంది. అమరావతి డివిజన్లో రైతులకు రూ.86 కోట్లు పరిహారంగా మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి.


