Helicopter Crash in Uttarakhand: దేశంలో వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం గురించి మరిచిపోకముందే ఉత్తరాఖండ్లో హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ ఇవాళ తెల్లవారుజామున 5.20 గంటలకు గుప్తకాశీ సమీపంలో గౌరీకుండ్ అడవుల్లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులతో పాటు పైలట్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
హెలికాఫ్టర్ టేకాఫ్ 10 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడంతో అడవుల్లో కూలిపోయినట్టు నిర్ధారణ అయిందని ఉత్తరాఖండ్ శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి. మురుగేశన్ వెల్లడించారు. మృతులను రాజ్వీర్(పైలట్), విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్కుమార్, శ్రద్ధా, రాశిగా గుర్తించారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వాసులుగా అధికారులు తెలిపారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భక్తులు మరణించడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.
కాగా చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఐదో ప్రమాదం కావడం గమనార్హం. జూన్ 5న ఉత్తరప్రదేశ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్ నాథ్ వెళ్తున్న హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్తరాఖండ్ లోని హైవేపై ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో పైలట్ కు స్వల్పగాయాలయ్యాయి. గతంలో కూడా ఉత్తరాఖాండ్లో హెలికాప్టర్ ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. సాంకేతిక సమస్యలతో పాటు పర్వత భూభాగంలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా తరుచుగా ప్రమదాల సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన గురించి చర్చ జరుగుతుండగానే ఇప్పుడు ఉత్తరాఖండ్ లో హెలికాఫ్టర్ కూలడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.