Highest temperature: దేశ రాజధాని దిల్లీ నిప్పుల కుంపటిలా మారుతోంది. నడిరోడ్డుపై సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా గ్రీన్పీస్ ఇండియా జరిపిన పరిశోధనలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. దిల్లీ వీధుల్లో థర్మల్ కెమెరాల ద్వారా పరిశీలించగా.. భూ ఉపరితల ఉష్ణోగ్రత అసాధారణంగా 64 డిగ్రీల పైన నమోదైంది. అయితే ప్రభుత్వ రికార్డులు, వాతావరణ యాప్లలో మాత్రం ఇది కేవలం 42 డిగ్రీలుగానే చూపిస్తుండటం గమనార్హం.
యాప్లలో తక్కువ.. రోడ్డుపై ఎక్కువ: సాధారణంగా వాతావరణ సంస్థలు, మొబైల్ యాప్లు ఒక ప్రాంతంలోని సగటు గాలి ఉష్ణోగ్రతను మాత్రమే లెక్కిస్తాయి. అంతేకాకుండా అది కేవలం సగటు మాత్రమే. కానీ ప్రజలు నేరుగా నడిచే రోడ్లు, నివసించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దీనికి భిన్నంగా ఉంటాయి. అందుకే యాప్లలో 42 డిగ్రీలుగా చూపిస్తున్నప్పటికీ.. థర్మల్ కెమెరాల్లో మాత్రం 64 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతోంది.
Also read-Rohini Karte: నేటి నుండి రోహిణి కార్తె షురూ.. అగ్నిగుండంగా తెలుగు రాష్ట్రాలు!
అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం: దిల్లీ అభివృద్ధి చెందిన నగరం. దీంతో జనాభా సైతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దిల్లీలో కాంక్రీట్ అడవులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటన్నిటి కారణంగా ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుందని గ్రీన్పీస్ ఇండియా సంస్థ వెల్లడించింది. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పిలుస్తారు. చెట్లను నరికేసి వాటి స్థానంలో భారీ కాంక్రీట్ కట్టడాలు, గాజు భవనాలు, డాంబర్ రోడ్లను నిర్మించడం వల్ల.. భూమి గ్రహించిన సూర్యరశ్మి తిరిగి వాతావరణంలోకి వెళ్లకుండా భూమిపైనే నిలిచిపోతోంది. కాంక్రీట్, తారు రోడ్లు పగటిపూట సూర్యరశ్మిని తీవ్రంగా పీల్చుకుని.. ఆ వేడిని రాత్రి వేళల్లో వాతావరణంలోకి విడుదల చేస్తూ నగరాలను అగ్నిగుండాలుగా మారుస్తున్నాయి.

