Maharashtra: మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే కర్జాత్-లోనావాల బోర్ఘాట్ సెక్షన్లో కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణె మధ్య నడిచే రైలు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రైల్వే ట్రాక్పై పడిన శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
భవనం కూలి ఆరుగురు దుర్మరణం: భారీ వర్షాల ధాటికి ముంబైలోని మాన్ఖుర్ద్ ప్రాంతంలో ఒక భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. రానున్న గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (IMD) ముంబయి నగరానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముంబై, ఠానె, పాల్ఘర్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
Also read-Cyclone: సముద్రతీరంలో అల్లకల్లోలం.. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు!

