పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ, ప్రతీకారాన్ని మరింత తీవ్రమైన దశకు తీసుకెళ్తోంది భారత్. పాక్ చేపట్టిన డ్రోన్, రాకెట్ దాడులను భారత సైన్యం సకాలంలో ఛేదించి దేశ భద్రతను కాపాడింది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాక్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వెంబడించి దానిలోని పైలట్ను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్కు తీవ్రంగా ఝలక్ ఇచ్చింది.
ఈ ఆపరేషన్లో ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా విరుచుకుపడుతున్న భారత్, టెర్రర్ డెన్లను ఒకొక్కటిగా నేలమట్టం చేస్తోంది. అయినా పాక్ తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడం గమనార్హం. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ వంటి కీలక సైనిక స్థావరాలపై పాక్ దాడులకు తెగబడినట్లు రక్షణశాఖ వెల్లడించింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సజాగ్రంగా పని చేసి గాల్లోనే ఛేదించాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. భారత్ ప్రతిస్పందనతో పాక్ దాడులు పూర్తిగా విఫలమయ్యాయని స్పష్టం చేశారు.
ఇక ఉగ్రవాదంపై భారత్ త్రిశూల్ వ్యూహంతో దూసుకెళ్తోంది. దేశంలోని టెర్రర్ స్లీపర్ సెల్స్ను శుద్ధి చేయడం, సరిహద్దుల్లో ఉగ్రవాద గూళ్లను ధ్వంసం చేయడం, పాక్ తరఫున జరిగే ప్రతీ చిన్న కవ్వింపు చర్యకు సమర్థవంతంగా ప్రతీకారం చూపించడం అనే మూడు అంశాలపై భారత బలగాలు ఏకకాలంలో దృష్టి పెట్టాయి. పాక్ కుయుక్తులకు అంతే స్థాయిలో బదులిస్తూనే, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా పాక్ ముద్ర వేయాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై చర్యలు చేపడుతోంది.
ఇటీవల భారత విదేశాంగ శాఖ తాలూకు చర్చలు యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి కీలక దేశాలతో కొనసాగుతున్నాయి. పాక్ ఉగ్రవాద మద్దతును ఎండగడుతూ భారత్ విశ్వవ్యాప్తంగా మద్దతు కూడగట్టుతోంది. యుద్ధోన్మాదంతో పాక్ ఏదైనా అప్రూవ్ చేసే దూకుడుగా వ్యవహరిస్తే… దానికి పది రెట్లు తీవ్రంగా బదులు ఇస్తామన్న సంకల్పంతో భారత దౌత్య, రక్షణ వ్యవస్థ ముందుకెళ్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించనుందని స్పష్టమవుతోంది.