దేశంలో కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే 31 నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,207కు చేరింది. ఇందులో అత్యధికంగా కేరళలో 1,147, తర్వాత మహారాష్ట్రలో 681 కేసులున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే మొత్తం కేసులలో 60 శాతం ఉన్నాయని వైద్యా ఆరోగ్యశాఖ చెబుతోంది. ఒక్క శుక్రవారం రోజునే మహారాష్ట్రలో 84 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశంలో కరోనా వల్ల మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో మహారాష్ట్రలో 6 మంది, కర్ణాటకలో 3 మంది మృతిచెందారు. కర్ణాటక మైసూర్లో ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కేరళ (2), యూపీ (2), రాజస్థాన్ (2), ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మిజోరాంలో 7 నెలల తర్వాత తొలి కరోనా కేసు నమోదు కాగా.. ఇద్దరికి వైరస్ సోకినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక దేశంలో కొత్తగా 4 కోవిడ్ వేరియంట్లు గుర్తించారు .. LF.7, XFG, JN.1, NB.1.8.1. ఇవి దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని నమూనాల్లో కనిపించాయి. అయితే ఇవి తీవ్రమైనవేగానీ, ఆందోళన కలిగించాల్సినవేగానీ కావని ICMR స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు.