భారత్ ఇప్పుడు పాకిస్తాన్పై అన్ని వైపులా ఒత్తిడి పెంచుతోంది. యుద్ధరంగం నుంచి రాజకీయ వేదికల వరకు. ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఎదురుదెబ్బలు తింటోంది. ఈసారి భారత్ ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ను అన్ని విధాలుగా అణిచివేయాలని, ఉగ్రవాదానికి ఇంకెప్పుడూ మద్దతు ఇవ్వలేనట్టు దాన్ని దెబ్బతీయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా, భారత్ తాజాగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF)ను ఆశ్రయించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలతో, దాన్ని మళ్లీ FATF గ్రే లిస్ట్లో చేర్చాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదం పుట్టినిల్లు అన్న పేరుతో అంతర్జాతీయంగా దూషణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కి ఇది మరో దెబ్బ కావడం ఖాయం.
FATF అనేది 1989లో స్థాపించబడిన అంతర ప్రభుత్వ సంస్థ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భద్రంగా ఉంచేందుకు ఇది మని లాండరింగ్, ఉగ్రవాద నిధుల వాడకం వంటి విభాగాల్లో నిబంధనలు రూపొందిస్తుంది. ఒక దేశం ఈ నియమాలు పాటించకపోతే, దాన్ని గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అధికారం FATFకు ఉంది. గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు మని లాండరింగ్ను నిరోధించడంలో కొంతవరకు విఫలమైనా, ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న దేశాలుగా పరిగణించబడతాయి. 2022 అక్టోబరులో పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్ నుంచి తొలగించారు. కానీ ఇప్పుడు భారత్ ఇచ్చిన తాజా సమాచారంతో — పాకిస్తాన్ మళ్లీ గ్రే లిస్ట్లో చేరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇలా జరిగితే పాకిస్తాన్పై భవిష్యత్లో మరిన్ని ఆర్థిక పరిమితులు విధించే అవకాశముంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార పరిమితులు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. ముఖ్యంగా IMF వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సహాయం పొందడంలో కూడా అది ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్కి ఆర్థికంగా తలెత్తుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠను కోల్పోవాల్సి వస్తుంది. దీంతో పాటు, బ్యాంకింగ్ వ్యవహారాల్లోనూ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది భారత్ ఈసారి పాకిస్తాన్ను ఒక్కసారి కాదు, అన్ని దారుల నుంచీ ఒత్తిడి చేయడం ద్వారా మట్టికరిపించాలనే ధోరణితో ముందుకెళ్తోంది.