Indian Army counters Trump : రష్యా నుంచి చమురు కొంటున్నామని భారత్పై గర్జిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, భారత సైన్యం ఊహించని రీతిలో గతాన్ని గుర్తుచేసింది. మాటలతో కాదు, ఏకంగా 54 ఏళ్ల నాటి ఒక పత్రికా కథనంతో చెంపపెట్టులాంటి సమాధానమిచ్చింది. ఈ ఒక్క పోస్ట్తో అమెరికా ద్వంద్వ నీతిని ప్రపంచం ముందు ఎండగట్టింది. ఇంతకీ ఆ పాత క్లిప్పింగ్లో ఏముంది..? 1971లో అమెరికా చేసిన ద్రోహానికి, ఇప్పటి ట్రంప్ మాటలకు ఉన్న సంబంధమేంటి..? ఈ చారిత్రక సాక్ష్యంతో భారత సైన్యం ట్రంప్కు ఎలా షాక్ ఇచ్చింది..?
గతాన్ని గుర్తుచేసిన సైన్యం : రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, సుంకాలు పెంచుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత సైన్యంలోని తూర్పు కమాండ్ (Eastern Command) తన ‘ఎక్స్’ ఖాతాలో 1971 ఆగస్టు 5 నాటి ఒక ఆంగ్ల పత్రిక కథనం క్లిప్పింగ్ను పోస్ట్ చేసి, ట్రంప్కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఆ క్లిప్పింగ్లో ఏముంది : భారత సైన్యం షేర్ చేసిన ఆ పాత వార్తా కథనం, 1971 యుద్ధ సమయంలో అమెరికా అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఆ కథనం ప్రకారం. 1971లో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ దురాక్రమణకు పాల్పడినప్పుడు, అమెరికా పాకిస్థాన్కు అండగా నిలిచింది.
పాకిస్థాన్కు ఏకంగా 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా సరఫరా చేసింది. ఆనాడు సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాక్కు ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరించినా, అమెరికా, చైనాలు మాత్రం చాలా తక్కువ ధరకే ఆయుధాలను విక్రయించి పాకిస్థాన్కు పూర్తి మద్దతు పలికాయి. ఆ ఆయుధాల సాయంతోనే పాకిస్థాన్ భారత్పై యుద్ధానికి తెగబడగలిగిందని ఆనాటి రక్షణ మంత్రి వీసీ శుక్లా రాజ్యసభకు తెలిపినట్లు ఆ కథనంలో ఉంది. ఈ పోస్ట్ ద్వారా, “నాడు పాకిస్థాన్కు ఆయుధాలిచ్చి యుద్ధాన్ని ప్రోత్సహించిన మీరు, నేడు మాకు నీతులు చెబుతారా?” అని భారత సైన్యం పరోక్షంగా ట్రంప్ను ప్రశ్నించింది.
పాక్పై ప్రేమ.. భారత్పై కక్ష : విచిత్రం ఏమిటంటే, భారత్పై సుంకాల భారం మోపుతానని బెదిరిస్తున్న ట్రంప్, పాకిస్థాన్ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించారు. ఆగస్టు 1న పాకిస్థాన్పై ఉన్న 29 శాతం సుంకాలను ఏకంగా 19 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు పాక్కు సుంకాలు తగ్గిస్తూ, మరోవైపు భారత్పై పెంచుతామనడం ట్రంప్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీతులు చెప్పే అమెరికా.. చేసేది ఇదే : ట్రంప్ బెదిరింపులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీటుగా తిప్పికొట్టింది. భారత్ను విమర్శిస్తున్న అమెరికా, ఐరోపా యూనియన్ (ఈయూ) దేశాలు రష్యాతో ఎంత భారీ వాణిజ్యం చేస్తున్నాయో లెక్కలతో సహా బయటపెట్టింది.
2024లో ఈయూ-రష్యా మధ్య 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.
2024లో ఈయూ దేశాలు రష్యా నుంచి రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకున్నాయి. అమెరికా, ఈయూ దేశాలు రష్యా నుంచి కేవలం చమురే కాకుండా ఎరువులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు వంటివి కూడా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ వాస్తవాలు ట్రంప్ ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయటపెట్టాయి.


