Kerala: కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ తుదిశ్వాస విడిచారు. సోమవారం తిరువనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. 101 ఏళ్ల వయస్సులో ఆయన మృతి చెందారు. జూన్ 23వ తేదీన ఆయనకు గుండె పోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ మరణవార్త విని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వీఎస్ అచ్యుతానందన్ తన జీవితంలో ప్రజా సేవకు, కేరళ పురోగతికే అంకితం చేశారన్నారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయని పేర్కొన్న ప్రధాని.. వీఎస్తో కలిసి మాట్లాడుతున్న ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, వీఎస్ అచ్యుతానందన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎనభై ఏళ్లుగా సాగిన వీఎస్ సుదీర్ఘ ప్రయాణం ఆదర్శాలు, ప్రజా సేవల పట్ల దృఢమైన నిబద్ధతను ప్రతిబంబిస్తుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూత పట్ల విచారం వ్యక్తం చేసారు. ఆయన 80 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి డీకే స్టాలిన్, కేరళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వీఎస్ అచ్యుతానందన్ ప్రజా నేతగా, జీవితాంతం కమ్యూనిస్టుగా జీవించారని గుర్తు చేసుకున్నారు. నీతిమంతమైన రాజకీయాలను, ప్రజా సేవా స్ఫూర్తికి ఆయన నిదర్శనమని ఎక్స్ లో పేర్కొన్నారు. తన విప్లవాత్మక వారసత్వాన్ని వదిలి వెళ్లిపోయారని అన్నారు. వీఎస్ మృతికి డీకే స్టాలిన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.


