Indigo Crisis Explained: ఇండిగో సంక్షోభం..వేలాది ప్రయాణీకుల ఇబ్బందులు, డీజీసీఏ ఉత్తర్వులు..ఉపసంహరణ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసిన జాతీయ మీడియా. అసలు తప్పెవరిది..గత వారం రోజులుగా అన్నీ ప్రశ్నలే..అన్నీ సందేహాలే. అన్నింటికీ కారణమేంటి, ఏం జరుగుతోంది పూర్తి వివరాలు మీ కోసం..
ఇండిగో సంస్థ గత వారం రోజులుగా రోజుకు వందలాది విమాన సర్వీసులు రద్దు చేస్తుండటంతో వేలాది మంది ప్రయాణీకులు దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల సహనం కోల్పోయిన ప్రయాణీకులు ఎయిర్పోర్ట్ సిబ్బందిపై దాడి కూడా చేసిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఇండిగో సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టత లేదు. మొత్తం సంక్షోభానికి తెరలేపిన డీజీసీఏ DGCA తన కొత్త నిబంధనల్ని వెనక్కి తీసుకుంది. సంక్షోభం సృష్టించి డీజీసీఏ వెనక్కి తగ్గేలా ఇండిగో సంస్థ ప్రయత్నించిందా, జాతీయ మీడియా ఇండిగోను లేదా డీజీసీఏను ప్రశ్నించకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఎందుకు టార్గెట్ చేసింది..ఇవే ఇప్పుడు ప్రధాన ప్రశ్నలు. ఆ వివరాలు తెలుసుకుందాం.
డీజీసీఏ కొత్త నిబంధనలేంటి DGCA New Rules
డీజీసీఏ గత ఏడాది 2024 జనవరిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణీకుల భద్రత, ప్రమాదాల నివారణ ధ్యేయంగా పైలట్లకు విశ్రాంతి అవసరమని భావించింది. ఇందులో భాగంగా పైలట్లకు వారంలో విశ్రాంతిని 36 నుంచి 48 గంటలకు పెంచింది. పైలట్ల నైట్ షిఫ్ట్ వారంలో 6 డ్యూటీల నుంచి 2 డ్యూటీలకు పరిమితి చేసింది. ఇక పైలట్ల డ్యూటీలు కూడా సక్రమంగా ఉండాలని తెలిపింది. ఈ నిబంధనలు తొలుత 2024 జూన్ నుంచి అమల్లోకి రావల్సి ఉండగా డీజీసీఏ అదే ఏడాది డిసెంబర్ వరకు వాయిదా వేసింది. ఈ ఏడాది 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు కూడా డీజీసీఏ నిబంధనలు ఆమోదయోగ్యమని, అమలు చేయాలని సూచించడంతో డీజీసీఏ మరి కొంత సమయం ఇచ్చి డీసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది.
అయితే దేశీయ, అంతర్జాతీయ విమానయాన సేవల్లో 65 శాతం ఆక్రమించిన ఇండిగోకు ఈ కొత్త నిబంధనలు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే పైలట్ల కొరత ఏర్పడింది. విమానయాన సేవలు నడపలేక చేతులెత్తేసింది. విమాన సర్వీసులు రద్దు చేస్తూ వచ్చింది. ఫలితంగా సంక్షోభం ఏర్పడిందా లేక ఇండిగోనే సంక్షోభం సృష్టించిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలకు తగ్గట్టే డీజీసీఏ కొత్త నిబందనల్ని వెనక్కి తీసుకుంది. మరో రెండు నెలల సమయం ఇచ్చింది. అంటే ఇండిగో సంస్థ తనకు అనుకూలంగా పరిస్థితి మల్చుకునేందుకు కావాలనే సంక్షోభం సృష్టించిందా అనే సందేహాలు అధికమయ్యాయి.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బలిపశువా Why National Media Targets Rammohan naidu
ఈ మొత్తం వ్యవహారం తరువాత ఇటీవల జాతీయ మీడియా ఒక్కసారిగా ఈ అంశంపై ఫోకస్ చేసింది. బీజేపీ అనుకూల మీడియాలు ఈ అంశంపై డిబేట్లు నిర్వహించాయి. ప్రధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసింది. రాజీనామా చేయాలనే ప్రశ్న లేవనెత్తింది. అందుకు తగ్గట్టే చర్చల్లో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ పరువు, రామ్మోహన్ నాయుడు ప్రతిష్టను దెబ్బతీశాయి. చర్చల్లో అనవసరంగా లోకేశ్ ప్రస్తావన తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. జాతీయ మీడియా ఇండిగోను లేదా డీజీసీఏ నిర్వాకాన్ని ప్రశ్నించకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడే అంతటికీ కారణంగా నిందించింది. ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించింది. ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటే రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నలు సంధించింది.
తాజాగా ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై రభస జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుుడు Rammohan Naidu ఈ అంశంపై సమాధానమిచ్చారు. ఇండిగో సమస్యను అంతర్గత సమస్యగా చెప్పే ప్రయత్నం చేశారు. త్వరలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు రావల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

