E-Passport Seva: పాస్పోర్ట్ సేవల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) వెర్షన్ 2.0లో భాగంగా ఈ-పాస్పోర్ట్ను ప్రవేశపెట్టింది. పాస్పోర్ట్ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన ‘ఈ-పాస్పోర్ట్’ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్పీ) 2.0’ కింద ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గతవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానం ప్రయాణికులకు పూర్తిస్థాయి డిజిటల్ ఇండియా అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/business/lauren-sanchez-jeff-bezos-wife/
ఇది సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. ఈ-పాస్పోర్ట్ కవర్పై బంగారు వర్ణపు చిన్న సింబల్ ఉంటుంది. సంప్రదాయ పాస్పోర్ట్లకు భిన్నంగా ఇందులో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీతో ఈ-పాస్పోర్ట్ అనుసంధానమై ఉంటుంది. పాస్పోర్ట్ కవర్లో చిప్, యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. ఈ చిప్లోనే పాస్పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత, బయోమెట్రిక్ డాటా తదితర కీలకమైన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో అథెంటికేషన్ సులభతరం అవుతుంది.
ఈ పాస్పోర్టు సేవలతో భద్రత మెరుగుపడుతుంది. నకిలీ, ఫోర్జరీ, వ్యక్తిగత సమాచారం చోరీ నుంచి ఇందులో ఉండే డిజిటల్ సంతకంతో కూడిన చిప్ రక్షణ కల్పిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాల సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో ఉండే చిప్ సాయంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా తక్కువ సమయంలో అథెంటికేషన్ చేయగలుగుతారు. సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతమవుతాయి.చిప్లో స్టోర్ చేసిన సున్నితమైన డాటాను ఇందులోని పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ)ఎన్క్ట్రిప్ట్ చేస్తుంది. తద్వారా ఆ డాటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. అన్ఆథరైజ్డ్ వర్గాలు అందులోని సమాచారాన్ని మార్చలేవు.
ALSO READ: https://teluguprabha.net/news/first-phase-of-census-2026/
ఈ-పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగా అధికారిక పాస్పోర్ట్ సేవా ప్లాట్ఫామ్ను సందర్శించాలి. కొత్త వినియోగదారులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారు నేరుగా లాగిన్ కావొచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫారం నింపి, సమీపంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్కే) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో (పీఓపీఎస్కే) అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ-పాస్పోర్ట్ కోసం నిర్ణీత ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. అనంతరం బయెమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ చేసిన తేదీన పీఎస్కే లేదా పీఓపీఎస్కేను సందర్శించి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.