Indian Railways: భారత రైల్వే సరికొత్త ప్యాకేజ్ తో రైలు ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఈ ప్యాకేజ్ లో ఒకేసారి ఐదు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఐఆర్సీటీసీ అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ప్యాకేజ్ ని ప్రకటించింది. ఈ యాత్రలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లో వెలిసిన ఐదు జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. వీటితో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితంలోని ముఖ్య ప్రదేశాలను చూసే విధంగా ఈ ప్యాకేజ్ యాత్ర రూపొందించబడింది.
Readmore: https://teluguprabha.net/national-news/pav-bhaji-crackdown-thieves/
ఈ యాత్ర ఆగష్టు 16న ప్రారంభమయి అదే నెల 24న ముగుస్తుంది. ఈ యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో తొమ్మిది రోజుల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిజామాబాద్, కామారెడ్డి మీదుగా ప్రయాణిస్తూ రెండవ రోజు ఉదయం నాగ్ పూర్ కి చేరుకుంటుంది. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షాభూమిని సందర్శిస్తారు. అదే రోజు స్వామినారాయణ మందిరాన్ని దర్శించిన అనంతరం యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
అక్కడి నుండి మూడవ రోజు ఉజ్జయిని చేరుకొని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకుని, నాలుగవ రోజు ఉదయం అంబేడ్కర్ జన్మస్థలానికి చేరుకుని జన్మభూమిని దర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం పూర్తి చేసుకుని నాసిక్ కి ప్రయాణం ప్రారంభిస్తారు. ఐదవ రోజు సాయంత్రం నాసిక్ చేరుకున్నాక ఆరవ రోజు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించి పూణేకి బయలుదేరుతారు. ఏడవ రోజు పూణే చేరుకొని భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శించి, ఎనిమిదవ రోజు ఔరంగాబాద్ కి వెళ్తారు. ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు అక్కడి ప్రదేశాలను సందర్శిస్తారు.
ఔరంగాబాద్ నుండి తిరుగు ప్రయాణంలో నిజామాబాద్, కామారెడ్డి మీదుగా తొమ్మిదవ రోజు ఉదయం సికింద్రాబాద్ కి చేరుకుంటారని ఐఆర్సీటీసీ ప్రకటనలో తెలిపింది. ఈ యాత్ర ప్యాకేజీని ఐఆర్సీటీసీ ఎకానమీ కేటగిరి, స్టాండర్డ్ కేటగిరి, కంఫర్ట్ కేటగిరిలలో అందుబాటులో ఉంచింది.
ఎకానమీ కేటగిరిలో ఒక్కరికి రూ.14,700, ఐదు నుండి 11 ఏళ్ల వయస్సు పిల్లలకు రూ.13,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదులలో వసతి ఉంటుంది.
స్టాండర్డ్ కేటగిరిలో ఒక్కరికి రూ.22,900, ఐదు నుండి 11 ఏళ్ల వయస్సు పిల్లలకు రూ.21,700 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో థర్డ్ ఏసీ క్లాస్ ప్రయాణం, ఏసీ గదులలో వసతి ఉంటుంది.
కంఫర్ట్ కేటగిరిలో ఒక్కరికి రూ.29,900, ఐదు నుండి 11 ఏళ్ల వయస్సు పిల్లలకు రూ.28,400 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సెకండ్ ఏసీ క్లాస్ ప్రయాణం, ఏసీ గదులలో వసతి ఉంటుంది.
ఈ యాత్రకి సంబంధించి ప్యాకేజీలో భాగమయ్యే మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం 9701360701, 9281030712, 9281030711 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.


