Saturday, November 15, 2025
Homeనేషనల్Impeachment : జస్టిస్ వర్మపై అభిశంసన.. లోక్‌సభలో తీర్మానంపై కీలక పరిణామం!

Impeachment : జస్టిస్ వర్మపై అభిశంసన.. లోక్‌సభలో తీర్మానంపై కీలక పరిణామం!

ok Sabha Initiates Impeachment Proceedings Against Justice Varma:  భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక అరుదైన, కీలకమైన ఘట్టానికి తెరలేచింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో, ఆయన అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తునకుగానూ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో ఈ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇంతకీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలేమిటి..? అభిశంసన ప్రక్రియ ఎలా జరగనుంది..? ఈ పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలేంటి..?

- Advertisement -

విచారణకు త్రిసభ్య కమిటీ :  జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణ నిమిత్తం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు న్యాయవాది బి.వి. ఆచార్య ఉన్నారు. ఈ కమిటీ, జడ్జిల విచారణ చట్టం-1968 ప్రకారం ఏర్పాటైంది. కమిటీ తన నివేదికను సమర్పించేంత వరకు అభిశంసన తీర్మానం పెండింగ్‌లో ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు.

అసలేం జరిగింది : ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పుతున్న సమయంలో అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు భారీ మొత్తంలో కాలిపోయిన, పాక్షికంగా కాలిన కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించి, విచారణకు ఆదేశించింది.

ఈ ఘటనపై విచారణ జరిపిన అంతర్గత న్యాయ విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం, జస్టిస్ వర్మ నివాసంలో లభించిన నగదుపై ఆయనకు “రహస్య లేదా క్రియాశీలక నియంత్రణ” ఉన్నట్లు కమిటీ నిర్ధారించింది. ఈ నివేదిక ఆధారంగా, అప్పటి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. దీనిని అనుసరించి, లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన 209 మంది ఎంపీలు (లోక్‌సభ నుంచి 146, రాజ్యసభ నుంచి 63) సంతకాలతో కూడిన అభిశంసన తీర్మాన నోటీసును స్పీకర్‌కు అందజేశారు.

అభిశంసన ప్రక్రియ ఇలా  :  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని అసమర్థత లేదా దుష్ప్రవర్తన రుజువైనప్పుడు పార్లమెంటు అభిశంసన ద్వారా తొలగించవచ్చు.

కమిటీ విచారణ: ప్రస్తుతం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి సాక్షులను పిలిపించి, విచారించే అధికారాలు ఉంటాయి. కమిటీ అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి, తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.

సభలో ఓటింగ్: స్పీకర్ ఆ నివేదికను సభ ముందు ఉంచుతారు. నివేదికలో న్యాయమూర్తి దోషి అని తేలితే, అభిశంసన తీర్మానంపై ముందుగా ఒక సభలో ఓటింగ్ జరుగుతుంది.

ప్రత్యేక మెజారిటీ: తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలో హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతుతో పాటు, సభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ కూడా అవసరం. ఇదే తరహాలో రెండో సభలోనూ తీర్మానం ఆమోదం పొందాలి.

రాష్ట్రపతి ఆమోదం: ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ప్రస్తుతం జస్టిస్ వర్మ విషయంలో అధికార, విపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నందున, అభిశంసన ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో ఒక సిట్టింగ్ జడ్జిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభం కావడం ఇది మూడోసారి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad