ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఎక్స్ వేదికగా శుభకాంక్షలు తెలిపారు. తెలుగు, కన్నడ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ పోస్టులో కన్నడిగులను ద్రవిడులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. స్టాలిన్ పోస్ట్పై పలువురు కన్నడవాసులు మండిపడుతున్నారు.
“కొత్త సంవత్సరాదికి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్న తెలుగు, కన్నడ మాట్లాడే ద్రవిడ సోదరులు, సోదరీమణులకు ఉగాది శుభాకాంక్షలు. హిందీ భాష బలవంతపు అమలు, డీలిమిటేషన్ వంటి భాషా, రాజకీయ ముప్పుల నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు ఐకమత్యంతో ఉండటం అత్యవసరం. మన హక్కులు, గుర్తింపును అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని మనమంతా కలిసి ఓడించాలి. ఈ ఉగాది మన ఐక్యతకు స్ఫూర్తిగా నిలవాలి’’ అని తెలిపారు.
కానీ కన్నడ ప్రజలను ద్రవిడులుగా సంభోదించడంపై కొంతమంది కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ద్రవిడులం కాదని.. కన్నడ ద్రవిడ భాష కాదు అని కన్నడిగులు విమర్శలు చేస్తున్నారు టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా స్టాలిన్పై విమర్శలు గుప్పించారు.