DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ట్రబుల్ షూటర్ గా ఆయనకు రాజకీయాల్లో పేరు ఉంది. తాజాగా ఆయన బెంగళూరులోని విధానసౌధ సమీపంలో సైకిల్ పై నుంచి జారిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా నగరంలో ఏర్పాటుచేసిన ఎకో-వాక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సైకిల్పై విధానసౌధకు బయలుదేరారు. నగర వీధుల్లో సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి చేరుకున్నారు.
అయితే విధానసౌధకు చేరుకున్న సమయంలో ఆయన సైకిల్ దిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి మెట్లపై కిందపడ్డారు. వెంటనే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు. దీంతో నవ్వుతూ కెమెరామెన్లను ఈ వీడియో ప్రసారం చేయవద్దు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో రకరకాలుగా స్పందిస్తున్నారు. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఆయన మెడలో లూయీ విటన్ కంపెనీకి చెందిన ఖరీదైన శాలువా ధరించడంతో స్టైలిష్ గాగుల్స్ పెట్టడంపై నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. కాగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ఎకో-వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డీకే శివకుమార్ కొనుగోలు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.