ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదారనాథ్ యాత్ర మార్గంలో మరోసారి హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం కేదారనాథ్ నుంచి సిర్సి హెలిప్యాడ్కు బయలుదేరిన క్రిస్టల్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలికాప్టర్, బడాసు సమీపంలో అనూహ్యంగా క్రాష్ అయింది. నడి రోడ్డుపై ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెలికాప్టర్లో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్కు స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. అయితే అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్, పెద్ద ప్రమాదాన్ని తప్పించాడని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు, సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారులు విచారిస్తున్నారు.
ఇటీవల ఇదే మార్గంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. దీంతో రెండు వారాల్లో ఇది రెండో ఘటన కావడం, హెలికాప్టర్ సేవలపై ఆందోళన కలిగిస్తోంది. పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా వేలాది మంది భక్తులు కేదారనాథ్కు హెలికాప్టర్ సేవలు వినియోగిస్తున్న తరుణంలో వరుస ప్రమాదాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. భద్రత ప్రమాణాలను పునఃసమీక్షించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రయాణికుడి జీవితం విలువైనదని, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు.
ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరుస ఘటనలపై విచారంతో పాటు జాగ్రత్తల అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.