Kejriwal Clarifies on Rajya Sabha Speculations : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్, పంజాబ్లలో జరిగిన ఉపఎన్నికల విజయాలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలు 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గెలుపులుగా తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఇక మూడో ప్రత్యామ్నాయంగా ‘ఆమ్ ఆద్మీ పార్టీ’పై ప్రజలు నమ్మకం ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్, తన రాజ్యసభ సభ్యత్వంపై వస్తున్న ఊహాగానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2027 ఎన్నికలకు సెమీఫైనల్ : పంజాబ్ ఉపఎన్నికల విజయాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, “మేం 2022లో గెలిచిన దానికంటే దాదాపు రెట్టింపు తేడాతో ఇప్పుడు గెలిచాం. పంజాబ్లో మెరుగైన పాలన ఉందని మరోసారి నిరూపితమైంది” అని అన్నారు. కొందరు ఈ ఉపఎన్నికల విజయాలను 2027 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా అభివర్ణిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. “2027లో ఆప్ తుఫాను వస్తుందని అంటున్నారు. మాకు భారీ మెజారిటీ విజయం ఇవ్వడం ద్వారా, పంజాబ్ ప్రజలు రాష్ట్రంలో ఆప్ పనికి తమ ఆమోద ముద్ర వేశారు” అని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి కాంగ్రెస్ – బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు : “ఉపఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుందని తరచూ చెబుతారు. కానీ గుజరాత్లో మా విజయం ప్రజలు 30 సంవత్సరాల బీజేపీ పాలనతో విసుగు చెందారని చూపిస్తుంది. వారు ఇప్పుడు ఆప్ను విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు” అని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపి పనిచేస్తుందని ఆరోపిస్తూ, “బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ పనిచేస్తుంది” అంటూ ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ – బీజేపీ స్నేహ సంబంధాలపై కేజ్రీవాల్ ఆరోపణలు : “ఆప్ను ఓడించడానికి కాంగ్రెస్ నాయకత్వం బీజేపీకి ఎలా సహాయపడిందో ఉపఎన్నికలు నిరూపించాయి. కాంగ్రెస్ బీజేపీకి కీలకంగా మారింది” అని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిని గ్రహించి ఆప్లో చేరాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన కోరారు. 2022లో గుజరాత్లోని విసావదర్ను గెలుచుకున్నప్పటికీ, ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు విసావదర్, లూథియానా వెస్ట్లో దాదాపు రెట్టింపు ఆధిక్యంతో గెలిచామని తెలిపారు. “ప్రజలు మా పని పట్ల సంతోషంగా ఉన్నారని ఇది ఒక పెద్ద సూచన” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
రాజ్య సభ ఊహాగానాలపై స్పష్టత: ఉపఎన్నికల్లో గెలిచిన గోపాల్ ఇటాలియా, సంజీవ్ అరోరాలకు కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. వారి విజయాల ద్వారా ప్రస్తుతం గుజరాత్లో పోటీ ఆప్, బీజేపీ మధ్య నేరుగా ఉందని సూచిస్తున్నాయని చెప్పారు. అయితే, గత కొద్ది రోజులుగా అరోరా స్థానంలో కేజ్రీవాల్ ఎగువ సభలోకి వెళ్తారని వినిపిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆ ఊహాగానాలను కొట్టిపడేశారు. సంజీవ్ అరోరా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, తాను రాజ్యసభకు వెళ్లబోనని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Kejriwal On AAP : రాజ్యసభ ఊహాగానాలపై కేజ్రీవాల్ స్పష్టత
- Advertisement -