Sunday, November 16, 2025
HomeTop StoriesSupreme Court : సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం: సీజేఐ గవాయ్‌పై న్యాయవాది షూ దాడి యత్నం!

Supreme Court : సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం: సీజేఐ గవాయ్‌పై న్యాయవాది షూ దాడి యత్నం!

Supreme Court security breach :  దేశ సర్వోన్నత న్యాయస్థానం అత్యంత నాటకీయ పరిణామాలకు వేదికైంది. సోమవారం ఉదయం కేసుల విచారణ జరుగుతున్న సమయంలో, ఓ న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్‌పై తన షూతో దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టు హాలులో అందరూ చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అసలు ఆ న్యాయవాది ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు? ఆయన ఆగ్రహానికి కారణమేమిటి? ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏమిటి..?

- Advertisement -

అసలేం జరిగిందంటే.. అడుగడుగునా ఉత్కంఠ :  సోమవారం ఉదయం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ చేపడుతోంది. విచారణ జాబితాలోని కేసులను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తున్న సమయంలో, న్యాయవాదుల దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి ధర్మాసనం వైపు దూసుకెళ్లాడు. డయాస్ వద్దకు చేరువైన ఆ వ్యక్తి, తన కాలికి ఉన్న షూను తీసి సీజేఐపై విసిరేందుకు ప్రయత్నించాడు.

ఈ హఠాత్పరిణామానికి కోర్టు హాలులో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సమీపంలోని ఇతర న్యాయవాదులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ఆయనను పట్టుకుని బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ న్యాయవాది, “సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు,” “భారత్ సనాతన ధర్మానికి జరిగే అవమానాన్ని సహించదు” అంటూ గట్టిగా నినాదాలు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది.

దాడి యత్నం వెనుక కారణం ఇదేనా : ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయ సముదాయంలోని దెబ్బతిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వ్యాజ్యం విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్, “వెళ్లి దేవుడినే అడగండి” అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. తాజా దాడి యత్నానికి సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలే కారణమై ఉండవచ్చని పలువురు న్యాయవాదులు భావిస్తున్నారు. ఆ వ్యాఖ్యల పట్ల నిరసనగానే ఈ న్యాయవాది ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

చలించని సీజేఐ.. కొనసాగిన విచారణ : అయితే, తనపై దాడికి యత్నం జరిగినప్పటికీ సీజేఐ జస్టిస్ గవాయ్ ఏమాత్రం చలించలేదు, సంయమనం కోల్పోలేదు.”ఇలాంటివి నన్ను ప్రభావితం చేయలేవు. మనం పరధ్యానంలో పడొద్దు” అని వ్యాఖ్యానించి, విచారణను కొనసాగించాలని తోటి న్యాయవాదులను కోరారు. కొద్దిసేపటి అంతరాయం తర్వాత కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న న్యాయవాదిని దిల్లీ పోలీసులకు అప్పగించి, విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad