Monday, February 16, 2026
Homeనేషనల్Lok Sabha Chaos: : 'నరవణె' పుస్తకంపై రాహుల్ వర్సెస్ రిజిజు.. లోక్ సభలో...

Lok Sabha Chaos: : ‘నరవణె’ పుస్తకంపై రాహుల్ వర్సెస్ రిజిజు.. లోక్ సభలో గందరగోళం!

India-China border issue debate in Lok Sabha : దేశ భద్రత అంటేనే అత్యంత సున్నితమైన అంశం. కానీ, అది రాజకీయ చదరంగంలో పావుగా మారితే? ప్రజాస్వామ్య దేవాలయమైన లోక్ సభలో మంగళవారం సరిగ్గా ఇదే పరిస్థితి తలెత్తింది. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణలు, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన ఆత్మకథలోని విషయాలు ఇప్పుడు సభను కుదిపేస్తున్నాయి.  ప్రచురణకు నోచుకోని ఆ పుస్తకంలో ఉన్న రహస్యాలేమిటి? వాటిని ప్రస్తావిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది? ఒక పుస్తకం చుట్టూ ఇంతటి ‘రాజకీయ రగడ’ ఎందుకు మొదలైంది? ఈ ఉత్కంఠభరిత వాగ్వాదం చివరకు ఏ మలుపు తిరిగింది?

- Advertisement -

సమరశంఖం పూరించిన రాహుల్: “దేశ భద్రతపై దాపరికం ఎందుకు : బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన గళాన్ని విప్పారు. 

నరవణె పుస్తకమే అస్త్రం: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన ఆత్మకథకు సంబంధించి ఒక ప్రముఖ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఆ పుస్తకంలో లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద నెలకొన్న పరిస్థితులపై విస్తుపోయే నిజాలు ఉన్నాయని, అవి దేశ ప్రజలకు తెలియాలని ఆయన పట్టుబట్టారు.

నన్నెందుకు ఆపుతున్నారు :  “చైనా, పాకిస్థాన్‌లతో మన సంబంధాలు దేశ భవిష్యత్తును శాసిస్తాయి. ఇలాంటి కీలక సమయంలో మన సైనికుల త్యాగాల గురించి, సరిహద్దుల్లో వాస్తవాల గురించి మాట్లాడకుండా నన్ను ఆపడం ఎంతవరకు సమంజసం?” అని రాహుల్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ పుస్తక ప్రచురణను ఎందుకు అడ్డుకుంటోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతిఘటించిన ప్రభుత్వం: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు.
సభా నియమాల ఉల్లంఘన: ప్రచురణ కాని పుస్తకాన్ని లేదా ధృవీకరించని కథనాలను సభలో ప్రస్తావించడం లోక్ సభ నిబంధనలకు విరుద్ధమని రిజిజు గుర్తుచేశారు. “ముందుచూపు” లేని ఇలాంటి వ్యాఖ్యలు సాయుధ దళాల మనోబలాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆరోపించారు.

స్పీకర్ రూలింగ్ ప్రస్తావన: ప్రచురించని పుస్తకం గురించి మాట్లాడకూడదని స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే సోమవారం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, అయినా రాహుల్ మళ్లీ అదే అంశాన్ని తవ్వడం సభను తప్పుదారి పట్టించడమేనని మంత్రి మండిపడ్డారు.

రసాభాస.. వాయిదాల పర్వం : కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం ప్రతిపక్ష నేత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించడంతో సభలో గందరగోళం పతాక స్థాయికి చేరింది. చైర్‌పర్సన్ కృష్ణప్రసాద్ తెన్నేటి సభను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఇరుపక్షాల సభ్యులు పోడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సభను తొలుత కాసేపు, ఆ తర్వాత బుధవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. “గోరుచుట్టుపై రోకలిపోటు” లాగా ఇప్పటికే ఉన్న విభేదాలకు ఈ పుస్తక వివాదం తోడవ్వడంతో పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News