Supreme Court: పొరుగుదేశాలు రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నేపాల్లో యువత నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశాన్ని వీడి భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ ఓ కేసు విచారణ సమయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లోని పరిస్థితులను ప్రస్తావిస్తూ.. మన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్లు పేర్కొంది.
Read Also: Asia Cup: క్రికెట్ ఫ్యాన్స్ కి పండుగ.. మరికొంత సేపట్లో మ్యాచ్..!
అభిప్రాయం కోరిన రాష్ట్రపతి
రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో న్యాయస్థానం తనకు గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరారు. కాగా.. రాష్ట్రపతి కోరిన అభిప్రాయం అంశం విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. కాగా.. ఈక్రమంలోనే రాజ్యాంగాన్ని ప్రస్తావించిన సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్.. ప్రజాప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీం కోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. ‘‘మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్లో పరిస్థితి గమనించండి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘అవును.. బంగ్లాదేశ్లోనూ’’ అంటూ జస్టిస్ విక్రమ్నాథ్ స్పందించారు.
Read Also: BCCI: అరటిపండ్లకు రూ.35 లక్షలా? బీసీసీఐకి హైకోర్టు నోటీసులు..!
బిల్లుల రిజర్వ్ అంశంపై..
బిల్లులను నెల రోజులకు పైగా రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్ల అధికారాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించారు. అటువంటి కేసులు తక్కువే ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లుల్లో 90 శాతం బిల్లులకు గవర్నర్ నెలలోపే సమ్మతి తెలుపుతారని చెప్పారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన ఏడు బిల్లులు సహా కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వ్లో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.


