ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా ప్రారంభించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో నెలకొల్పిన ఈ ప్రొడక్షన్ యూనిట్ రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. సుమారు 80 హెక్టార్ల భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించిందని సీఎం యోగి తెలిపారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేయడంలో బ్రహ్మోస్ క్షిపణుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు ప్రభావవంతంగా ఉపయోగించబడ్డాయని అధికారికంగా ధృవీకరించారు. బ్రహ్మోస్ ధాటిని ఎవరైనా చూడలేకపోతే, పాకిస్తాన్ను అడిగి తెలుసుకోవచ్చు అని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం దృఢంగా ముందడుగు వేస్తోందని గుర్తుచేస్తూ, ఇకపై దేశంలో చోటుచేసుకునే ప్రతి ఉగ్రవాద చర్యను ‘యుద్ధ చర్య’గా పరిగణించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారని సీఎం యోగి వెల్లడించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నశింపజేసే వరకు శాంతి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
“ఉగ్రవాదం అనేది కుక్క తోకలా ఉంటుంది. ఎంత ఒడిపించినా నిటారుగా ఉండదు. దీనిని పూర్తిగా అణచివేయాలంటే మనందరం మోదీ నాయకత్వంలో ఏకతాటిపైకి రావాలి,” అంటూ ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యత మరింత చాటి చెప్పబడింది. బ్రహ్మోస్ యూనిట్ ప్రారంభం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, దేశ రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.