Saturday, February 14, 2026
Homeనేషనల్Mallikarjun Kharge : 'సమాచార' హక్కుకు సంకెళ్లు.. మోదీ సర్కార్‌పై ఖర్గే 'కన్నెర్ర'!

Mallikarjun Kharge : ‘సమాచార’ హక్కుకు సంకెళ్లు.. మోదీ సర్కార్‌పై ఖర్గే ‘కన్నెర్ర’!

Dilution of Right to Information Act in India :  ప్రజాస్వామ్యానికి పారదర్శకత ప్రాణవాయువు. పాలనలో జవాబుదారీతనాన్ని ప్రశ్నించే సామాన్యుడి చేతిలోని వజ్రాయుధం ‘సమాచార హక్కు చట్టం’ (RTI). అయితే, ఇప్పుడు ఆ ఆయుధాన్ని కేంద్ర ప్రభుత్వం మొండిగా మారుస్తోందా? ఇప్పటికే ఎంజీనరేగా (ఉపాధి హామీ) పథకాన్ని నిర్వీర్యం చేసిన మోదీ సర్కార్, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా ఆర్​టీఐని ఎంచుకుందా? ఆర్​టీఐ కార్యకర్తల వరుస హత్యలు, వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులు దేనికి సంకేతం? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -

‘ఉపాధి’ తర్వాత ఇప్పుడు ‘ఆర్​టీఐ’ వంతు : ఆర్థిక సర్వే నివేదికలో ఆర్‌టీఐ చట్టాన్ని ‘పునఃపరిశీలించాలి’ అని పేర్కొనడంపై మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కేంద్రం ఇప్పటికే ఎంజీనరేగాను చంపేసింది. ఇప్పుడు ఆర్‌టీఐ వంతు వచ్చిందా?” అంటూ ఆయన ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. నిజాన్ని వెలికితీసే వారిని రక్షించాల్సింది పోయి, వారిపై భయాందోళనలు సృష్టించేలా ప్రభుత్వ తీరు ఉందని ఆయన ఆక్షేపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా ఆర్‌టీఐ కార్యకర్తలు హత్యకు గురవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.

పారదర్శకతకు తూట్లు పొడుస్తున్న ‘సవరణలు’ : మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా ఆర్​టీఐ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఖర్గే సోదాహరణంగా వివరించారు:
2019 సవరణలు: సమాచార కమిషనర్ల పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా మార్పులు చేసి, వారి స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారని ఆరోపించారు.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (2023): గోప్యత పేరుతో అవినీతిని దాచుకోవడానికి ఈ కొత్త చట్టం ఒక కవచంలా మారిందని ఖర్గే విమర్శించారు. దీనివల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు, ఎంజీనరేగా కూలీల వివరాలు కూడా బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
పెండింగ్ కేసులు: 2025 నాటికి 26 వేలకు పైగా ఆర్‌టీఐ కేసులు పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని ఎత్తిచూపారు. ప్రధాన సమాచార కమిషనర్ పోస్టును కూడా ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రులకు ‘వీటో’ అధికారం.. పాతాళానికి పారదర్శకత : ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, సిబ్బంది నివేదికలను ప్రజల నుంచి దాచాలని కేంద్రం యోచిస్తోందని ఖర్గే ఆరోపించారు. ముఖ్యంగా సమాచారాన్ని నిలిపివేయడానికి మంత్రులకు ‘వీటో’ (Veto) అధికారం కల్పించే ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఇది కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీతనం నుంచి తప్పించడమేనని అభిప్రాయపడ్డారు.

చరిత్ర సాక్షిగా.. మన పైసా – మన లెక్క : యూపీఏ ప్రభుత్వ హయాంలో 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన ఈ చట్టం వెనుక దశాబ్దాల పోరాటం ఉంది. 1990లలో అరుణా రాయ్ నేతృత్వంలోని ఎంకేఎస్ఎస్ (MKSS) ఉద్యమం “మన పైసా – మన లెక్క” అనే నినాదంతో సాగించిన పోరు ఆర్​టీఐకి పునాది వేసింది. 2జీ స్పెక్ట్రమ్ వంటి భారీ కుంభకోణాలను బయటపెట్టిన ఈ చట్టం నేడు మనుగడ కోసం పోరాడుతుండటం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News