Tragedy in Maharashtra: ఇద్దరి మధ్య జరిగిన గొడవకు అభం శుభం తెలియని చిన్నారి ఆస్పత్రి పాలయ్యాడు. తండ్రితో గొడవ కారణంగా నాలుగేళ్ల బాలుడిపై అమానుషంగా దాడికి పాల్పడి.. తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. మహారాష్ట్రలోని ముంబయిలో ఈ హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది.
ముంబయి సమీపంలోని వసాయి ప్రాంతంలో, ఒక చిన్న విషయంపై తండ్రితో వాగ్వాదం జరిగిన తర్వాత ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని నేలకేసి విసరడంతో పాటు తలను ఇనుప రాడ్కు కొట్టి దారుణంగా హింసించాడు. వసాయి ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అక్కడి సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల బాలుడు విఘ్నేష్ పసుపు రంగు టీ-షర్టు ధరించి సెల్లార్లోని ఆటో- రిక్షాలో కూర్చుని తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఉన్నాడు.
అదే సొసైటీలో ఉండే సందీప్ పవార్ ఓ చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవపడ్డాడు. ఈ కోపంతో విఘ్నేష్ వద్దకు వెళ్లి బాలుడిని బలంగా లాగి నేలపై పడేశాడు. ఆ తర్వాత బాలుడిని నేలపై ఒకసారి విసరడమే కాక ఇనుప రాడ్తో కొట్టాడు. తోటి పిల్లలు భయంతో గట్టిగా అరవడంతో బాలుడిని నేలపై పడేసి పరారయ్యాడు. గమనించిన సొసైటీ వాసులు, ఆందోళనకు గురైన కుటుంబీకులు హుటాహుటిన బాలుడిని మీరా రోడ్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విఘ్నేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

