Man Protesting For Sister’s Job Shoots Himself Dead: మధ్యప్రదేశ్ విద్యా శాఖలో తన చెల్లికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న ఒక వ్యక్తి సోమవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు.
మృతుడిని మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాకు చెందిన లోకేంద్ర (40)గా గుర్తించారు. ఆయన తన చెల్లి ఉద్యోగం కోసం జూలై నుంచి ఢిల్లీలోనే ఉంటూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
దయనీయ మరణం
“లోకేంద్ర బావగారు 2019లో మధ్యప్రదేశ్ విద్యా శాఖలో ప్యూన్గా పనిచేస్తూ మరణించారు. దాంతో కారుణ్య నియామకాల (compassionate grounds) కింద తన చెల్లికి ఆ ఉద్యోగం ఇవ్వాలని లోకేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాడు,” అని అధికారి తెలిపారు.
సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో లోకేంద్ర జంతర్ మంతర్ వద్దే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేంద్ర శరీరంపై తుపాకీ గాయం ఉండటాన్ని గుర్తించారు.
ALSO READ: Delhi bomb blast: ఢిల్లీలో భారీ పేలుడు.. భయానక విజువల్స్.. ముక్కలు ముక్కలైన మృతదేహాలు
“సంఘటన స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపుతాము. ఏ పరిస్థితుల్లో లోకేంద్ర కాల్చుకున్నాడనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాము,” అని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నిరుద్యోగ సమస్యకు నిరసనగా లోకేంద్ర తీసుకున్న ఈ కఠిన నిర్ణయం అందరినీ కలచివేసింది.


