Monday, June 16, 2025
Homeనేషనల్Pune Bridge Collapses: దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

Pune Bridge Collapses: దేశంలో మరో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి

Pune Bridge Collapses: దేశంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరుస విమాన ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో ఏకంగా 278 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఇవాళ ఉదయం కేదార్ నాథ్ వెళ్తున్న హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్ అడవుల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లో ఉన్న ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదాలను మర్చిపోకముందే మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం సంభవించింది.

పూణే జిల్లాలోని కుండమల ప్రాంతంలోని ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మరణించగా.. మరో 25 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన కుండమలకు వీకెండ్ కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెనపై నుంచి నదీ అందాలను వీక్షిస్తున్నారు. అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కూలింది. దీంతో వంతెనపై ఉన్న ప్రజలు నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. వంతెన పాతది కావడంతో పాటు భారీగా జనాలు ఉండటంతో బరువు తట్టుకోలేక కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. అది కాక రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో దశాబ్ధాల కాలం నాటి వంతెన కూలినట్లు అంచనా వేస్తున్నారు.

మరోవైపు వర్షాల ధాటికి నది ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆదివారం పూట సరదాగా సేద తీరుదామని వచ్చిన వారు ఆరుగురు విగతజీవులుగా పడి ఉండటం.. కొంతమంది గల్లంతు కావడంతో వారి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News