Maoist Lays Down Arms In Bijapur and Kanker: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో ఇటీవలి కాలంలో మావోయిస్టు అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. ప్రతిరోజూ లొంగుబాట్లకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. బుధవారం కూడా భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో ఒకేసారి 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు, కాంకేర్ జిల్లాలోనూ 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దాంతో ఈరోజు మొత్తం 72 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత కొన్నిరోజులుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతల దగ్గర్నుంచీ కింది స్థాయిలో పని చేసే వరకూ చూస్తూ ప్రతీ రోజూ లొంగిపోతూనే ఉన్నారు. నిన్న(అక్టోబర్ 28)న పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్లు లొంగిపోయారు. తెలంగాణ ఎస్ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్లో ఈ ఇద్దరు మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కొన్ని రోజుల క్రితం లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న వీరు లొంగిపోయిన తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు సైతం వారి వారిప్రాంతాల్లో పోలీసుల ఎదుట లొంగిపోతూ వస్తున్నారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ కావడంతో మావోయిస్టులు తమ ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు.
దండకారణ్యంలో ప్రతికూల పరిస్థితులు..
కాగా, దండకారణ్యంలో పరిస్థితులు అనుకూలించడంతో కేంద్ర ప్రభుత్వం 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. దళాల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ప్రతీ ఎన్కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీలో ఓ వర్గం సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పి లొంగుబాటుకు సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మావోయిస్టులకు అనుకూలంగా లేకపోవడంతో వారు లొంగిపోక తప్పడం లేదనేది అంగీకరించాల్సిన విషయం. కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇటీవల భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. చాలామంది మావోలు ఈ కాల్పుల్లో మృతి చెందారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా చాలా మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో ఏకంగా 71 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీళ్లలో కాంకేర్ ప్రాంతం నుంచే 50 మావోలు, నారాయణ్పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోయారు.


