మావోయిస్టు అగ్రనేత హిడ్మా అరెస్ట్ అయ్యాడు. ఒడిశాలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోరాపుట్ జిల్లాలోని బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్గూడ గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జిల్లా వాలంటరీ ఫోర్స్ హిడ్మాను పట్టుకుంది. అతడి వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 117 డిటోనేటర్లు, గన్పౌడర్, వాకీటాకీలు, కత్తులు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అంతానికి ప్రారంభించిన “ఆపరేషన్ కగార్”లో భాగంగా వరుసగా అరెస్టులు, కాల్పులు జరుగుతున్నాయి. ఇటీవలే మావోయిస్టు అగ్రనేత బసవరాజుతో పాటు 30 మందికిపైగా మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యారు. దీంతో మావోయిస్టు నాయకుల్లో గుబురు మొదలై, కొంతమంది లొంగిపోవడానికి సిద్ధమయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హిడ్మా అరెస్ట్ కీలక మలుపుగా భావిస్తున్నారు.
మావోయిస్టు వర్గాల్లో హిడ్మాగా ప్రసిద్ధి చెందిన కుంజుమ్ హిడ్మా అలియాస్ మోహన్ గత కొంతకాలంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ప్రణాళిక రచన చేస్తూ ఉన్నాడు. మూడు రాష్ట్రాల ఉమ్మడి యాంటీ-నక్సల్ బలగాల పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో అతడిని అరెస్ట్ చేశారు. హిడ్మా అరెస్ట్తో మావోయిస్టు నెట్వర్క్కు గట్టి దెబ్బ తగిలినట్లయ్యిందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.