Man searching for ancestral roots : 150 ఏళ్ల తర్వాత.. పూర్వీకుల ఊరి కోసం ‘రామ్’ అన్వేషణ! 150 ఏళ్ల క్రితం వలస వెళ్లిన పూర్వీకుల మూలాలను వెతుక్కుంటూ, మారిషస్ నుంచి ఓ వ్యక్తి ఒడిశా వచ్చారు. అధికారుల సహాయంతో తన ఊరి కోసం అన్వేషిస్తున్నారు.
శతాబ్దంన్నర క్రితం నాటి కథ.. కరువు కోరల్లో చిక్కి, కన్న గడ్డను వదిలి, సముద్రాలు దాటి వెళ్లిన ఓ తరం వ్యథ.. ఆ తరం ఐదో వారసుడి గుండెల్లో రగిలిన మూలాల వేదన! ఇది థ్రిల్లర్ సినిమాను మించిన నిజ జీవిత కథ. 150 ఏళ్ల క్రితం తన తాతలు బతికిన ఊరిని వెతుక్కుంటూ, మారిషస్ దేశం నుంచి ఓ వ్యక్తి ఒడిశాకు వచ్చారు. పాత భూమి రికార్డులు, ఓడరేవు పత్రాల సాయంతో, అధికారుల అండతో సాగిస్తున్న ఆయన అన్వేషణ, అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అసలు ఎవరీ రామ్రుజ్? ఆయన ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర కథేంటి?
మారిషస్కు చెందిన 64 ఏళ్ల రామ్రుజ్ జుగ్గుర్నాథ్, తన పూర్వీకుల మూలాలను వెతుక్కుంటూ ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాకు వచ్చారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను కలిసి, తన అన్వేషణకు సహకరించాలని కోరారు.
“నేటికి కూడా ఒడియా సంస్కృతి మా రక్తంలో ప్రవహిస్తోంది. మా పూర్వీకులు ఈ జిల్లాలో ఎక్కడ నివసించారో తెలుసుకోవాలని వచ్చాను. ఆ ఊరికి చేరుకుంటే, నా ఈ సుదీర్ఘ ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.”
– రామ్రుజ్ జుగ్గుర్నాథ్
ఆయన ఆవేదనకు చలించిన అధికారులు, ఆయనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
150 ఏళ్ల క్రితం ఏం జరిగింది : 1840-1870 మధ్యకాలంలో ఒడిశాలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకలి చావుల నుంచి తప్పించుకునేందుకు, ఉపాధి కోసం వేలాది మంది సముద్ర మార్గంలో మారిషస్ వంటి దేశాలకు వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో, జాజ్పూర్ జిల్లాకు చెందిన రామ్రుజ్ ముత్తాత జుగ్గుర్నాథ్ (అసలు పేరు జగన్నాథ్ దాస్ కావచ్చు) కూడా ఒకరు. 1870లో, 25 ఏళ్ల వయసులో మారిషస్లో అడుగుపెట్టిన ఆయన, అక్కడే కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి, 1912లో మరణించారు. ఆయన ఐదో తరం వారసుడే ఈ రామ్రుజ్.
భావోద్వేగాల నడుమ.. పిండ ప్రదానం : అధికారులు రామ్రుజ్ను, ఆయన పూర్వీకులు తరచూ తలుచుకునే పవిత్ర వైతరణీ నదీ తీరానికి తీసుకెళ్లారు. అక్కడ, తన తాతకు రామ్రుజ్ పిండ ప్రదానం చేసి, అంకుల్ చితాభస్మాన్ని నదిలో నిమజ్జనం చేశారు. ఈ క్రమంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతరం, ప్రఖ్యాత ‘మా బిరజా’ ఆలయాన్ని దర్శించుకుని, “అమ్మ ఆశీర్వాదంతో, నా హృదయం వెతుకుతున్నది కచ్చితంగా దొరుకుతుంది,” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం, సీనియర్ అధికారులు, చరిత్రకారుల బృందం, పాత భూమి రికార్డులు, ఓడరేవు పత్రాలు, ఆలయాల రికార్డులు, గ్రామాల పటాల సాయంతో, రామ్రుజ్ పూర్వీకుల గ్రామాన్ని గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

