Saturday, February 22, 2025
Homeనేషనల్Mirchi rate: మిర్చి ధర పతనంపై కేంద్ర మంత్రితో మాట్లాడా

Mirchi rate: మిర్చి ధర పతనంపై కేంద్ర మంత్రితో మాట్లాడా

రైతులను ఆదుకుంటాం

మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రేట్లు పడిపోయాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయి. మిర్చి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహౌన్ దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రమంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యలను వివరించాం. శుక్రవారం అధికారులతో కేంద్రమంత్రి సమీక్షిస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మిర్చి ధర పతనంపై సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు.

- Advertisement -

రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం

ఈ యేడాది 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి సేకరించాల్సి ఉంది…ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఈ యేడాది రాష్ట్రంలో మిర్చి సాగైంది. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. సాగు ఖర్చులను లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరాం. దీనిపై శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఏ విధంగానైనా రైతులను ఆదుకోవడం ముఖ్య ఉద్దేశం. శనివారం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలు తెలుసుకుంటా. ఇప్పటికే కేంద్రానికి 3 సార్లు లేఖలు రాశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు వచ్చి కేంద్ర అధికారులతో మాట్లాడారు. మా ప్రధాన ఉద్దేశం మిర్చి రైతులను ఆదుకోవాలని కోరడానికి ఢిల్లీకి వచ్చాం. రైతులు నష్టపోకుండా ఏం చేయాలో చేస్తాం.

రైతులను పట్టించుకోని వారు మాట్లాడుతున్నారు

పంటలకు సంబంధించి ధరలు ఒక్కోసారి తగ్గుతాయి… ఒక్కోసారి పెరుగుతాయి. రైతులకు గతంలో ఏమీ చేయలేని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు. 2019కి ముందు ధరలు తగ్గితే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.138 కోట్లు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నాం. మళ్లీ డబ్బలివ్వబోయేది ఎన్డీయేనే. బాధ్యత లేకుండా మిర్చి యార్డులోకి వెళ్లారు. ఎన్నికల కోడ్ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. కానీ పోటీలో మేం లేం కాబట్టి మాకు వర్తించదని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లారు. ఇల్లీగల్ పనులు చేసి సెక్యూరిటీ కావాలని అడిగారు. మీరు చేసే ఇల్లీగల్ పనులకు పోలీసులు రక్షణగా ఉండాలా? నేరాలు చేస్తుంటే మీ వెనక పోలీసులు రావాలా?

జల్ జీవన్, పోలవరంపై చర్చ

జలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్‌ను కూడా కలిసి జల్ జీవన్ మిషన్, పోలవరంపై చర్చించాం. పోలవరం పనులు సజావుగా సాగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానంపైనా చర్చించాం. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీరు ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరవు లేకుండా ఉంటుంది. పోలవరం నుంచి బనకచర్ల నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కోరాం. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు కూడా రాష్ట్రానికి వస్తారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కుళాయి నీటిని అందించాలన్నది లక్ష్యం. కానీ గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక్కశాతం కూడా ఉపయోగించుకోలదు. రాష్ట్రానికి రూ. 27 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది. పైపులైన్ల ద్వారా కాకుండా బోరు బావుల ద్వారా ఇస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రూ.50 వేల కోట్ల నిధులను యూపీ ఖర్చు చేసింది. గుజరాత్‌లో ఇంటికంటికీ కుళాయి ద్వారా నిరంతరంగా నీళ్లు ఇస్తున్నారు. కేంద్రం ఈ పథకాన్ని మళ్లీ నిబంధనలు మార్చి 2028కి పనులు పూర్తి చేయాలని సమయం పెంచింది. దీని ప్రకారం గతంలో కేటాయించిన రూ.27 వేల కోట్లు మాత్రమే వస్తాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కుళాయి ద్వారా నీరివ్వాలంటే అదనంగా రూ.54 వేల కోట్లు అవసరం. దీనిపై కూడా కేంద్రంతో మళ్లీ సంప్రదిస్తాం. ప్రస్తుతం రూ.27 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రాన్ని నిధులు కోరతాం.

తప్పుడు విధానాలతో ప్రజలకు నష్టం

గత ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఈ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాహరణ. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేశారు. వాటిల్లో కొన్ని పథకాలకు మేము వచ్చాక మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించి నిధులు ఖర్చు చేసి యూసీలు ఇచ్చాం. కేంద్రం ఇచ్చే పథకాలు ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది. కానీ గత ప్రభుత్వ చేతకాని పాలన వల్ల సమస్యలు వచ్చి పడ్డాయి… వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం.

సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటున్నాం

నదులు ప్రవహించే వరుసలో చూసుకుంటే ఏపీ చిట్టచివర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళందించాం. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే నీరు ఉపయోగించుకోవాలని చూస్తున్నాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఏపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాటినే వాడుకుంటున్నాం. రాజకీయం అంటే ప్రజల సమస్యల కోసం పని చేయడం రాజకీయం అవుతుంది. ఏపీలో ఎన్డీయే చిత్తశుద్ధితో పని చేస్తోంది.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News