Saturday, November 15, 2025
Homeనేషనల్MK Stalin: ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’.. రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల కోసమే నా నిర్ణయాలు

MK Stalin: ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’.. రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల కోసమే నా నిర్ణయాలు

MK Stalin Man Of Steel: తమిళనాడు అభివృద్ధి కోసం తాను తీసుకునే నిర్ణయాలు సుదీర్ఘ ప్రయోజనాలు అందించేలా ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఉద్ఘాటించారు. త్వరలో హోసూరులో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతేకాకుండా అధునాతన ఐటీ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. హోసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో స్టాలిన్‌ ఈ కీలక విషయాలను ప్రకటించారు.

- Advertisement -

అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ పార్క్‌

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హోసూరు. ఇక్కడ 2000 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ సందర్భంగా తెలిపారు. హోసూరులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సు వేదికగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని సీఎం స్టాలిన్‌ అన్నారు. 

దాదాపు 50వేల మందికి ఉపాధి

మొత్తం 92 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రాష్ట్రానికి రూ. 24,307 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 49,353 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు వివరించారు. పారిశ్రామిక, వాణిజ్య శాఖల ఆధ్వర్యంలో 53 పెద్ద కంపెనీలతో రూ. 23,303 కోట్లకు, ఎంఎస్‌ఎంఈ శాఖ ద్వారా 39 సంస్థలతో రూ.1003.85 కోట్లకు ఈ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. 

‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’

‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ మాదిరి తాను తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఉంటాయని ఈ సందర్బంగా సీఎం స్టాలిన్‌ అన్నారు. గతంలో ఒక చిన్న పట్టణంగా ఉన్న హోసూరు, నేడు దేశవిదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే స్థాయికి చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో త్వరలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 400 కోట్ల నిధులతో అధునాతన ఐటీ పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

నాలుగు కొత్త పథకాలు

ఇటీవలే జర్మనీ, ఇంగ్లండ్ పర్యటనల ద్వారా రూ.15,516 కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం అన్నారు. ఆ ఉత్సాహంతోనే ఈ సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, రూ.1600 కోట్ల విలువైన నాలుగు కొత్త పథకాలకు శంకుస్థాపన చేసి.. 8,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. తమ నాలుగన్నరేళ్ల పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 77 శాతం ఇప్పటికే ఫ్యాక్టరీల రూపంలో కార్యరూపం దాల్చాయని చెప్పారు. ఇది ప్రభుత్వ పనితీరులో పారదర్శకతకు, పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని స్టాలిన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad